నరకప్రాయంగా మారిన రహదారి
చెరువును తలపిస్తున్న రోడ్లు
భయం భయంగా ప్రయాణాలు
పట్టించుకోని అధికారులు
తాండూరు, ఆగస్టు 6 (విజయక్రాంతి): రోడ్డు అధ్వానంగా మారి సంవత్సరాలు గడుస్తున్నా బాగు చేసే వారు దిక్కు లేక ప్రయాణికులు, వాహనదారులు నరకం అనుభవిస్తున్నారు. వికారాబాద్ జిల్లా తాండూర్ వైపు నుండి పెద్దేముల్ వరకు ఉన్న తారు రోడ్డు గుంతల మయంగా మారింది.
అడుగడుగునా గుంతలు ఉండడంతో ఆ గుంతలను తప్పించి ప్రయాణం చేయడం వాహనదారులకు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందు లు తప్పడం లేదు. గమ్యం చేరేవరకు ప్రాణా లు అరిచేతిలో పెట్టుకుని భయం భయంగా నే ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. ప్రధానంగా ఘాజీపూర్ వాగు బ్రిడ్జి దగ్గర అప్రోచ్ రోడ్డు మట్టితో వేయడంతో దాదాపు కిలోమీటర్ దూరం వరకు రోడ్డు అంతా గుంతల మయంగా మారింది.
ఇక బుద్ధారం బ్రిడ్జి నుండి పెద్దేముల్ వరకు రోడ్డుపై ఉన్న తారు కొట్టుకపోవడంతో కంకర తేలి మోకాళ్ళ వరకు గుంతలు ఏర్పడ్డాయి. నాలుగు కిలోమీటర్ల వరకు రోడ్డు చెరువును తలపిస్తుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గుంతల్లో వర్షపు నీరు చేరడంతో ఎక్కడ గుంత ఉందో. .ఎక్కడ రోడ్డు ఉందో.. తెలియక ప్రయాణం ప్రమాదం అంచున కొనసాగుతున్నాయి. ఇప్పటికైనా పాలకులు, సంబంధిత అధికారులు స్పందించి రోడ్డును బాగు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. ఈ విషయమై ఆర్అండ్బి అధికారి శ్రవణ్ను వివరణ కోరగా.. త్వరలో మరమ్మతు పనులు ప్రారంభించి పూర్తి చేస్తామని అన్నారు.






