17-12-2025 07:41:22 PM
డీసీపీ రీతి రాజ్..
రామచంద్రపురం: సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం, కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని మై హోమ్ అంకురా గేటెడ్ కమ్యూనిటీలో నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏసీపి శ్రీనివాస్ కుమార్, కొల్లూరు ఎస్హెచ్ఓ గణేష్ పటేల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాదాపూర్ డీసీపీ రీతి రాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డీసీపీ రీతి రాజ్ మాట్లాడుతూ, న్యూ ఇయర్ వేడుకల సమయంలో సౌండ్ పొల్యూషన్, అధిక మద్యం సేవనం, డ్రగ్స్ వినియోగం వంటి చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా వేడుకలు నిర్వహించరాదని సూచించారు.
నూతన సంవత్సరం వేడుకలు నిర్వహించాలంటే తప్పనిసరిగా పోలీస్ అనుమతి తీసుకోవాలని, నిర్ణయించిన సమయాన్ని కచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే గేటెడ్ కమ్యూనిటీ నివాసితులు తెలిపిన పలు అంశాలపై పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని డీసీపీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గేటెడ్ కమ్యూనిటీ నివాసితులు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది, మల్లెపల్లి రాజేందర్ రెడ్డి, రమణ తదితరులు పాల్గొన్నారు. ప్రజల సహకారంతో శాంతియుతంగా, సురక్షితంగా నూతన సంవత్సరం వేడుకలు జరుపుకోవాలని పోలీసులు కోరారు.