సర్వాయి పాపన్న పోరాటం స్ఫూర్తిదాయకం
అడిషనల్ కలెక్టర్ పాండు
సంగారెడ్డి, ఆగస్టు 18: సామాజిక సమానత్వం, సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అదనపు కలెక్టర్ పాండు అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని పురస్కరించుకుని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం వద్ద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ పాండు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అణగారిన, బడుగు,బలహీన వర్గాల హక్కుల కోసం, సామాజిక సమానత్వం కోసం ధైర్యంగా పోరాడిన మహనీయుడని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి జగదీష్, బీసీ సంఘాల నాయకులు, అధికారులు, సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.






