26న రవీంద్రభారతిలో సత్యాన్వేషి నాటక ప్రదర్శన
ముషీరాబాద్, ఆగస్టు 21 (విజయక్రాంతి): కళా విపంచి నిర్మాణ సారధ్యంలో గోవాడ క్రియేషన్స్ నిర్వహణలో సత్యాన్వేషి నాటక ప్రదర్శన ఈనెల 26న రవీంద్ర భారతి ఆడిటోరియంలో ప్రదర్శించనున్నట్లు కళావిపంచి అధ్యక్షుడు బొప్పన నర్సింహరావు వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం హైదర్గూడ లోని ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సత్యాన్వేషి నాటక ప్రదర్శన కు సంబంధించిన బ్రోచర్ ను సెక్రటరీ బాగి శివ శంకర్ శాస్త్రి, కోవాడ క్రియేషన్స్ అధ్యక్షుడు స్వరాజ్ కుమార్, రచయిత చిలువేరు రఘునాథ్, కో డైరెక్టర్స్ రాజు, జ్యోతి, యువ కళా వాహిని అధ్యక్షుడు లంక లక్ష్మీనారాయణతో కలసి కళావిపంచి అధ్యక్షుడు బొప్పన నర్సింహరావు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యాన్వేషి ను రఘునాథ్ రచించారని, దీనికి డా. వెంకట్ గోవాడ దర్శకత్వం వహించారని తెలిపారు. నూతన అంశాలను సమాజానికి తెలియజేసే ఉద్దేశ్యంతో ఈ సత్యాన్వేషి ని రచించడం జరిగిందని రచయిత రఘునాథ్ తెలిపారు. నాటకం అనేది ఒక సమన్వయం అని, అందరూ కలిస్తేనే నాటకాన్ని రూపొందించగలుగుతామన్నారు. అంతర్మథనం నుండి సత్యాన్వేషి రూపంలో వచ్చేదే ఈ కథనం అని పేర్కొన్నారు.






