29-07-2025 12:28:33 AM
ప్రజావాణిలో ఓయు జేఏసీ అధ్యక్షులు జోగు నరేందర్ ఫిర్యాదు
ఇబ్రహీంపట్నం, జూలై 28:అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూమిని అక్రమ చెర నుండి కాపాడాలని ఓయు జేఏసీ అధ్యక్షులు జోగు నరేందర్ అన్నారు. సోమవారం ప్రజావాణిలో జిల్లా అడిషనల్ కలెక్టర్ డీఆర్ఓ సంగీత కు, నరేందర్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని ఆక్రమించి, కొత్త దందాకు తెర లేపిందన్నారు.
గురునానాక్ కాలేజీ సొంత భూమి కొంత మాత్రమే ఉండగా చుట్టూ ఉన్నసర్వే నెం.80 ప్రభుత్వ భూమిని యాజమాన్యం కబ్జా చేసిందన్నారు. ఇటీవలా స్థానిక ఎమ్మార్వో తన బృందంతో సర్వే నిర్వహించి, కాలేజీ యాజమాన్యం భూ ఆక్రమణ చేసింది నిజమని తేల్చి, ప్రభుత్వ భూమి అని బోర్డులు పెట్టారు.
అయితే ఆ బోర్డులను మరుసటి రోజే కాలేజీ యాజమాన్యం తొలగించడం జరిగిందన్నారు. ఇక్కడే అసలు సమస్య మొదలైందనీ, ఆ బోర్డులను తొలగించిన యాజమాన్యంపై ఎమ్మార్వో ఎందుకు కేసులు నమోదు చేయలేదనీ ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై ప్రత్యేక కమిటీ వేసి విచారణ చేయాలని, అత్యంత విలువైన ఈ ప్రభుత్వ భూమిని అక్రమార్కుల చెర నుండి విడిపించాలనిఅన్నారు.