03-01-2026 04:32:04 PM
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని బాపూనగర్లో అరిగెల నివాసంలో శనివారం సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి వన్ నేషన్–వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వరావు, భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి అరిగెల మల్లికార్జున్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యమని నమ్మిన మహానీయురాలు సావిత్రిబాయి ఫూలే అని కొనియాడారు.
ఆమె తన భర్త జ్యోతిరావు ఫూలేతో కలిసి 1848 జనవరి 1న పుణేలో దేశంలోనే మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించి మహిళా విద్యకు బాటలు వేశారని తెలిపారు. నిరక్షరాస్యురాలిగా ఉన్న సావిత్రిబాయికి ఆమె భర్త జ్యోతిరావు ఫూలే తొలి గురువుగా నిలిచి, ఇంట్లోనే అక్షరాభ్యాసం చేయించి విద్యావంతురాలిని చేశారని చెప్పారు. అనంతరం ఆమె ఆధునిక భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా గుర్తింపు పొందిందని, పీడిత వర్గాలు, ముఖ్యంగా మహిళల విద్యాభివృద్ధి కోసం జీవితాంతం కృషి చేసిన తొలి తరం మహిళా ఉద్యమకారిణి అని అన్నారు. సావిత్రిబాయి ఫూలే జీవితం ప్రతి మహిళకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.