05-06-2025 01:17:37 AM
- పశువుల అక్రమ రవాణాలను అరికట్టేందుకు పోలీసుల నడుం బిగింపు
- అక్రమ రవాణా చేస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తాం
- జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర
కామారెడ్డి, జూన్ 4 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో పశువుల అక్రమ రవాణాను నియంత్రించేందుకు జిల్లా లో ఏడు చెక్పోస్టులను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర తెలిపారు. కామారెడ్డి జిల్లాలో మాచారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘన్పూర్ వద్ద చెక్పోస్ట్, భిక్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టోల్ప్లాజా, బస్వాపూర్ చెక్పోస్టులను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశువుల అక్రమ రవాణా నియంత్రణకు జిల్లాలో నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందన్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం, అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు. చెక్ పోస్ట్ ల వద్ద విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉండి వాహనాలు తనిఖీ చేయాలని సూచించారు. రాత్రి సమయంలో తప్పకుండా టార్చ్ లైట్ ఉపయోగించాలని సిబ్బందికి ఎస్పి తెలిపారు.
కామారెడ్డి జిల్లాలో పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లా సరిహద్దుల్లో మొత్తం ఏడు చెక్పోస్టులు ఏర్పాటు చేశామని, వీటిలో 24 గంటల పాటు నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. పోలీసు శాఖతో పాటు ఇతర సంబంధిత శాఖల సిబ్బంది సమన్వయంతో షిఫ్ట్ల వారీగా విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. చెక్పోస్టుల వద్ద వాహనాల తనిఖీ, వాహనాల ఎంట్రీ రికార్డుల పరిశీలనను స్వయంగా పరిశీలించి, అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి తగిన సూచనలు చేశారు.
శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పశువుల రవాణా విషయంలో ఎలాంటి వివా దాలు తలెత్తకుండా ముందస్తు చర్యగా ప్రత్యే క చెక్పోస్టులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా జంతువుల అక్రమ రవా ణావంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. సంబంధిత వాహనాల్లో చట్టబద్ధమైన ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా ఉండాలని, అక్రమ రవాణా జరిగితే సంబంధిత వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఏ వ్యక్తి,సంస్థ స్వయంగా వాహనా లను ఆపకూడదనీ, ఈ విషయంలో ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా అనుమానాస్పద అక్రమ రవాణా గమనించిన పక్షంలో వెంటనే డయల్ 100 కు గాని నేరుగా సంబంధిత పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సోషల్ మీడియాలో ద్వేషపూరిత, రెచ్చగొట్టే, అసభ్యకరమైన పోస్టులు పెడితే, వారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.
పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా, మత సామరస్యంతో జరుపుకునేలా అవసరమైన చోట్ల ముందస్తుగా పటిష్టమైన పోలీసు బందోబస్తు, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పి రాజేష్ చంద్ర తెలిపారు.