25-09-2025 01:22:50 AM
-1,258 మందిని జనరల్ అసిస్టెంట్లుగా క్రమబద్ధీకరణ
-ఉత్తర్వులు జారీ చేసిన సింగరేణి సీఎండీ బలరాం
పెద్దపల్లి, సెప్టెంబరు 24 (విజయక్రాంతి): సింగరేణి కార్మికులకు సంస్థ సీ అండ్ ఎండి బలరాం నాయక్ తీపి కబురు చెప్పారు. సంస్థలో బదిలీ వర్కర్లుగా చేరి భూగర్భ గనులు, ఓపెన్ కాస్ట్ గనులు, సర్ఫేస్ లో పనిచేస్తూ 190 మస్టర్లు పూర్తి చేసిన వారిని జన రల్ అసిస్టెంట్ కేటగిరి క్రమబద్ధీకరించేందుకు వీలుగా సింగరేణి యాజమాన్యం ఉత్తర్వులు విడుదల చేసింది.
2024, డిసెంబర్ 31 అంతకు ముందు తమ సంవత్సర కాలం సర్వీసు చేసిన వారిని భూగర్భ గనుల్లో అయితే 190 మస్టర్లు, ఓపెన్ కాస్ట్ గనుల్లో లేదా సర్ఫేస్లో అయితే 240 మస్టర్లు పూర్తి చేసి ఉన్న బదిలీ వర్కర్లను జనరల్ అసిస్టెంట్ కేటగిరి క్రమబద్ధీకరించ డానికి యాజమాన్యం అంగీకరించింది. సింగరేణి సీఎండీ బలరాం, డైరెక్టర్ పర్సనల్ గౌతమ్ పొట్రులతో గుర్తింపు కార్మిక సంఘంతో జరిపిన చర్చల అనంతరం యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు క్రమబద్ధీకరణ ప్రతిపాదనలు పంపించాల్సిందిగా జనరల్ మేనేజర్ (పర్సనల్), ఐఆర్పీఎం బుధవారం అన్ని ఏరియాలకు ఒక సర్క్యులర్ జారీ చేశారు.
ప్రాంతాల వారీగా బదిలీ వర్కర్లు
రామగుండం ఏరియాలో 303 మంది బదిలీ వర్కర్లను జనరల్ అసిస్టెంట్ కేటగిరి గా క్రమబద్ధీకరిస్తారు. భూపాలపల్లి ఏరియాలో 250 మందికి, శ్రీరాంపూర్ ఏరియాలో 241 మందికి, రామగుండం- అడ్రియాల ఏరియాలలో 167 మందికి, రామగుండొోం1లో 156 మందికి, మందమర్రిలో 64 మందికి, కార్పొరేట్లో 21 మందికి, కొత్తగూడెం ఏరియాలో 20 మందికి, మణుగూరు ఏరియాలో 19 మందికి, బెల్లంపల్లి ఏరియాలో 11 మందికి, ఇల్లందు ఏరియాలో ఆరుగురికి జనరల్ అసిస్టెంట్ కేటగిరి-1గా లబ్ధి కలగనుంది.