calender_icon.png 12 January, 2026 | 10:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యమాలకు నినాదాలే ఊపిరి!

11-01-2026 12:00:00 AM

జుర్రు నారాయణ యాదవ్ :

ఉద్యమాల విజయంలో నినాదాలకు అత్యంత కీలకపాత్ర ఉంటుం ది. నినాదం అనేది ఉద్యమ లక్ష్యాలను, భావజాలాన్ని, ప్రజల ఆవేదనను కొన్ని పదాల్లో బలంగా వ్యక్తపరిచే సాధనం. అది ప్రజల మనసుల్లో స్పందనను రేపి ఉద్యమానికి దిశానిర్దేశం చేస్తుంది. సమాజంలో నెలకొన్న సమస్యలు, అన్యాయాలు, అసమానతలపై లోతైన అవగాహన నుంచే నినాదాలు పుడతాయి. ఉద్యమ నాయకు లు లేదా మేధావులు ఆ భావాలను సరళమైన, సూటిగా అర్థమయ్యే పదాల్లో మలుస్తారు.

ప్రపంచ చరిత్రలో అనేక ఉద్యమాలకు నినాదాలు ప్రాణవాయువుల్లా పనిచేశాయి. కొన్ని నినాదాలు తమ ఉద్యమాలకే కాదు, సమస్త మానవజాతి చైత న్యానికి ప్రతీకలుగా మారాయి. ఫ్రెంచి విప్లవంలో వినిపించిన ‘స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం’ అనే నినాదం రాజ్యాధికార దమనానికి వ్యతిరేకంగా ప్రజలను ఏకతాటిపై నిలబెట్టింది. ఈ నినాదం ప్రజాస్వా మ్యం, మానవ హక్కుల భావనలకు పునా ది వేసింది.

అదే విధంగా, అమెరికా స్వాతంత్య్ర ఉద్యమంలో ‘నో టాక్సేషన్ వితౌట్ రిప్రజెంటేషన్’ నినాదం వలస పాలనపై తిరుగుబాటుకు స్పష్టమైన రాజకీయ అర్థాన్ని ఇచ్చింది. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో ‘క్విట్ ఇండియా’, ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ వంటి నినాదాలు కోట్లాది భారతీయుల్లో స్వేచ్ఛాకాంక్షను రగిలించా యి.

దక్షిణాఫ్రికాలో నెల్సన్ మండేలా నేతృత్వంలోని వర్ణవివక్ష వ్యతిరేక ఉద్యమంలో ‘ఫ్రీడం నౌ’ నినాదం కావొచ్చు,  మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ముందుండి నడిపిన పౌరహక్కుల ఉద్యమంలో ‘ఐ హావ్ ఎ డ్రీమ్’ అనే నినాదం ప్రజా ఉద్యమానికి ఊపిరి పోశాయి. ఇక తెలంగాణ ఉద్యమం లో ‘నీళ్లు-, -నిధులు-, -నియామకాలు’ అనే నినాదం కీలక పాత్ర పోషించింది. రాష్ర్ట వనరులపై స్థానికుల హక్కును ప్రతిపాది స్తూ, నీటి వాటా, ఆర్థిక వనరులు, ఉద్యోగాల న్యాయ పంపిణీ కోసం ప్రజలను ఉద్యమ మార్గంలో నడిపించింది.

హిస్సా---ఇజ్జత్---హుకుమత్

‘హిస్సా-ఇజ్జత్---హుకుమత్’ అనే నినా దం భారత్‌లో ముఖ్యంగా వెనుకబడిన తరగతుల (బీసీ) ఉద్యమాలకు దిశానిర్దేశం చేసి న శక్తివంతమైన భావవ్యక్తీకరణ. ఈ నినా దం బీసీ సమాజం ఎదుర్కొంటున్న చారిత్రక అన్యాయాలను సమగ్రంగా వ్యక్తపరు స్తుంది. ఇది కేవలం ఒక నినాదం మాత్రమే కాకుండా, సామాజిక న్యాయం కోసం సాగుతున్న పోరాటానికి తాత్విక ఆధారంగా నిలిచింది. ‘హిస్సా’ అంటే సమాజ వనరు ల్లో న్యాయమైన వాటా.

భూమి, విద్య, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యం వంటి రంగాల్లో బీసీలకు తగిన భాగస్వామ్యం దక్కకపోవడాన్ని ఈ పదం ప్రశ్నిస్తుంది. ఆర్థిక అభివృద్ధి ఫలాలు కొద్దిమందికే పరిమితమై ఉండకూడదని, సమాజంలోని ప్రతి వర్గానికి సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరాన్ని ఇది గుర్తుచేస్తుంది. ఇక ‘ఇజ్జత్’ అంటే గౌరవం. శతాబ్దాలుగా కులవ్యవస్థలో బీసీలు సామాజిక అవమా నాలకు, నిర్లక్ష్యానికి గురయ్యారు.

విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో పాల్గొన్నప్పటికీ వారి ప్రతిభకు తగిన గౌరవం లభించని పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘ఇజ్జత్’ అనే పదం ఆత్మగౌరవం, సమాన మానవ విలువల కోసం సాగించే పోరాటానికి ప్రతీకగా నిలుస్తుంది. ‘హుకుమత్’ అంటే అధికారంలో భాగస్వామ్యం. ప్రజాస్వామ్యంలో అధికార కేంద్రాల్లో బీసీ ల ప్రాతినిధ్యం లేకుండా నిజమైన సామాజిక న్యాయం సాధ్యం కాదని ఈ భావన స్పష్టం చేస్తుంది.

విధాన నిర్ణయాల్లో భాగస్వామ్యం ఉన్నప్పుడే హిస్సా, ఇజ్జత్ అనే లక్ష్యాలు కార్యరూపం దాల్చుతాయి. మొత్తంగా ‘హిస్సా--ఇజ్జత్---హుకుమత్’ నినాదం బీసీ ఉద్యమానికి స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించింది. ఇది బీసీ సమాజంలో చైతన్యాన్ని పెంపొందించి, సంఘటిత పోరాటానికి ప్రేరణనిస్తూ, సమానత్వం, న్యాయం, గౌరవం గల సమాజ నిర్మాణానికి మార్గదర్శకంగా నిలుస్తుంది.

సామాజిక న్యాయమెప్పుడు?

‘హిస్సా సాధన కోసం సమాజం సమగ్రంగా, చైతన్యంతో పనిచేయాలి. హిస్సా కోసం వనరుల న్యాయ పంపిణీ జరగాలి. విద్య, ఉపాధి, భూమి, వ్యాపారం, సంక్షేమ పథకాల్లో వెనుకబడిన వర్గాలకు నిజమైన అవకాశా లు కల్పించాలి. జనాభా ప్రాతిపదికన విధానాలు రూపొందించడం, రిజర్వేషన్లను సమర్థంగా అమలు చేయడం సమాజం కోరాల్సిన అంశాలు. ఇజ్జత్ కోసం కులాధారిత వివక్షను సామాజికంగా నిరాకరించాలి.

విద్యా సంస్థలు, మీడియా, సాంసృ్కతిక వేదికల ద్వారా బీసీ వర్గాల గౌరవాన్ని ప్రతిబింబించే కథనాలు, ఆదర్శాలను ప్రోత్స హించాలి. హుకుమత్ కోసం రాజకీయ చైతన్యం పెరగాలి. బీసీ వర్గాల నుంచి నాయకత్వాన్ని తయారు చేయడం, ప్రజాస్వామ్య సంస్థల్లో వారి ప్రాతినిధ్యాన్ని పెంచడం అవసరం.

ఓటు హక్కును అవగాహనతో వినియోగిస్తూ, సామాజిక న్యా యాన్ని నమ్మే నాయకులను ముందుకు తేవాలి. అంతిమంగా చైతన్యం, సంఘటిత పోరాటం, ప్రజాస్వామ్య భాగస్వామ్యమే ‘హిస్సా సాధనకు మార్గం. సమాజం ఈ మూడు లక్ష్యాలను సమిష్టి బాధ్యతగా భావించినప్పుడే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవు తుంది.

రాజకీయ అవగాహన..

బీసీలకు ‘హిస్సా---ఇజ్జత్---హుకుమత్’ లక్ష్యాలను సాధించేందుకు తెలంగాణలో బీసీ ఇంటెలెక్చువల్  ఫోరం నేడు పోరాటాలను ఉధృతం చేసింది. ఈ నేపథ్యంలో నేడు (ఆదివారం) మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ‘పాలమూరు సామాజిక న్యాయ సభ’ పేరుతో నిర్వహించనున్న బహిరంగ సభ ద్వారా బీసీ గొంతుకు ప్రభుత్వానికి బలంగా వినిపించేందుకు సిద్ధమయ్యింది. మొదట హిస్సా కోసం, బీసీలకు సంబంధించిన గణాంకాలు, సామాజిక--ఆర్థిక స్థితిగతులపై అధ్యయనాల కోసం సమగ్ర చర్చను లేవనెత్తనున్నారు. రెండోదైన ఇజ్జత్ కోసం, బీసీ సమాజంలో ఆత్మగౌరవ చైతన్యాన్ని పెంపొందిస్తుంది. 

చరిత్రలో బీసీల పాత్రను వెలుగులోకి తెచ్చే కార్యక్రమాలు, సదస్సులు, పుస్తకాలు, మీడి యా చర్చల ద్వారా సామాజిక గౌరవాన్ని నిర్మించేందుకు ప్రయత్నిస్తుంది. మూడోదైన హుకుమత్ కోసం, బీసీ నాయకత్వాన్ని తయారు చేయడంపై దృష్టి పెడుతుంది. యువత, విద్యార్థుల్లో రాజకీయ అవగాహన పెంచి వారిని ప్రజాస్వామ్య ప్రక్రియల్లో భాగస్వాములను చేయాలి. 

అంతిమంగా తెలంగాణలో బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో జరగనున్న “హిస్సా సభ ద్వారా ఉద్యమమనేది నినాద స్థాయికే పరిమితం కాకుండా.. ఆలోచన, అవగాహన ఉద్యమంగా మార్చేందుకు ప్రయత్నం జరుగుతున్నది.

 వ్యాసకర్త సెల్: 9494019270