calender_icon.png 15 September, 2025 | 3:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖురాన్‌పై సోషల్ మీడియా పోస్ట్.. 200 మందిపై కేసు

15-09-2025 02:14:23 PM

లక్నో: ముహమ్మద్ ప్రవక్త, ఖురాన్‌పై(Quran) అభ్యంతరకరమైన సోషల్ మీడియా పోస్టుల తర్వాత శుక్రవారం చెలరేగిన నిరసనకు సంబంధించి ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో పోలీసులు(Shahjahanpur Police) 200 మంది గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ప్రవక్త, ఖురాన్‌పై సోషల్ మీడియాలో(Social media) అవమానకరమైన పోస్టులు పెట్టినందుకు 45 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసిన తర్వాత కేసులు నమోదు చేశారు. శుక్రవారం అరెస్టు జరిగిన వెంటనే, రాత్రి 9 గంటల ప్రాంతంలో అనేక మంది పోలీస్ స్టేషన్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. నిరసన హింసాత్మకంగా మారడంతో నినాదాలు చేశారు. అంతటితో ఆగకుండా రెండు బైకులకు నిప్పంటించారు. అలాంటి పోస్టుల వెనుక ఉన్న వ్యక్తిని అరెస్టు చేశామని పోలీసులు వారికి వివరించిన తర్వాత కూడా వారు వెనక్కి తగ్గలేదు. ఈ అంశంపై షాజహాన్‌పూర్ ఎస్పీ రాజేష్ ద్వివేది మాట్లాడుతూ... జనసమూహాన్ని చెదరగొట్టడానికి దళ సిబ్బంది లాఠీచార్జ్ చేయాల్సి వచ్చిందన్నారు. ఆ తర్వాత నిరసనకారులు లాల్ ఇమ్లీ క్రాసింగ్‌ను అడ్డుకున్నారని, చాలాసార్లు ఒప్పించిన తర్వాత దానిని తొలగించామని  ఎస్పీపేర్కొన్నారు.

సదర్ పోలీస్ అవుట్‌పోస్ట్(Sadar Police Outpost) ఇన్‌ఛార్జ్ శివం అగర్వాల్ ఫిర్యాదు మేరకు శుక్రవారం నిరసనలు నిర్వహించిన 200 మంది గుర్తుతెలియని వ్యక్తులపై సోమవారం కేసు నమోదు చేసినట్లు ద్వివేది తెలిపారు. శనివారం, హిందూ దేవతల గురించి ఫేస్‌బుక్‌లో అసభ్యకరమైన పోస్టులు పెట్టినందుకు పోలీసులు ఒక మహిళను అరెస్టు చేయగా, ఆ సోషల్ మీడియా పోస్టులను ప్రచారం చేసినందుకు కొంతమందిపై కేసు నమోదు చేశారు. షాజహాన్‌పూర్‌లో పరిస్థితి ప్రశాంతంగా ఉందని ఎస్పీ తెలిపారు. అయితే ముందు జాగ్రత్త చర్యగా నగరం అంతటా పోలీసు బలగాలను మోహరించామన్నారు. మార్కెట్ ప్రాంతాల్లో పోలీసులు నిరంతరం ఫ్లాగ్ మార్చ్‌లు నిర్వహిస్తున్నారని తెలిపారు. సోషల్ మీడియాలో ఏ కులం, మతం, ఎవరికీ వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయవద్దని  ఎస్పీ రాజేష్ ద్వివేది ప్రజలకు విజ్ఞప్తి చేసారు. మత సామరస్యాన్ని దెబ్బతీసేలా అలాంటి పోస్ట్‌లు చేయకూడదని హెచ్చరించారు. సోషల్ మీడియా మానిటరింగ్ బృందం అవమానకరమైన పోస్ట్‌ను పోస్ట్ చేసిన, ఫార్వార్డ్ చేసిన వారి జాబితాను తయారు చేసిందని ఆయన వెల్లడించారు. వైరల్ వీడియోలు, పోలీసులు తయారు చేసిన క్లిప్‌లు, సీసీటీవీ ఫుటేజ్‌లను స్కాన్ చేయడం ద్వారా నిరసనకారులను గుర్తించడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు.