గోకారం-నేలపట్ల రోడ్డు మరమ్మతులు చేపట్టాలని కలెక్టర్ కు వినతి పత్రం
వలిగొండ (విజయక్రాంతి): గోకారం-నేలపట్ల బీటీ రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని కోరుతూ సోమవారం సీపీఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు తుర్కపల్లి సురేందర్, కార్యదర్శి కవిడే సురేష్ లు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు(District Collector Hanumantha Rao)కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోకారం గ్రామం నుండి రోజు వారీగా హైదరాబాద్ వెళ్లడానికి, పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు వెళ్లడానికి, రెవెన్యూ డివిజన్ కేంద్రానికి వెళ్లడానికి ఇదే ప్రధానమైన రోడ్డు కావడం వలన వందలాది మంది ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అదేవిధంగా సుమారు 20 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన ఆర్ అండ్ బి రోడ్డుకు ఇప్పటికీ ఎలాంటి మరమ్మతులు చేపట్టలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు సిర్పంగి శ్రీరాములు, దేశపాక బాబు, నారి రామస్వామి తదితరులు పాల్గొన్నారు.






