calender_icon.png 20 June, 2025 | 5:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆధ్యాత్మికతతోనే సామాజిక శాంతి

05-06-2025 12:54:53 AM

- హంపి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యారణ్యభారతీస్వామి 

జగిత్యాల, జూన్ 4 (విజయక్రాంతి): నేటి సాంకేతిక, యాంత్రిక జీవనంలో ఆధ్యాత్మికతతోనే సమాజంలో శాంతి సాధ్యమని హంపి పీఠాధిపతి జగద్గురు శంకరాచార్యులు శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతీ స్వామి పేర్కొన్నారు. కోరుట్ల నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ పునః ప్రతిష్టాపన కుంభాభిషేక ఉత్సవాల్లో భాగంగా బుధవారం జేష్ట నవమిని పురస్కరించుకొని అమ్మవారిని లలితా పరాంబిక ఏకవీర దేవిగా అలంకరించి, మహిళలచే సామూహిక శ్రీచక్రార్చన నిర్వహించారు.

కాగా అమ్మవారికి హంపి స్వామీజీ స్వయంగా సహస్రనామ కుంకుమార్చన, షోడశ ఉపచార పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ ప్రపంచ దేశాలన్నిటికీ మన భారతదేశం సనాతన సంస్కృతి, సంప్రదాయాలను అందించిన ఆది గురువని అభివర్ణించారు. మానవుడు ఎంత సాంకేతిక పరిజ్ఞానాన్ని సంపాదించినా, సైన్స్ ఎంతగా పెరిగినా అవన్నీ మన ప్రాచీన వేదాల్లో చెప్పబడిన అంశాలేనని పేర్కొన్నారు. మనందరం విధిగా సనాతన భారత సంస్కృతీ, సంప్రదాయాలు ఆచరించాలని, అప్పుడే ఆరోగ్యంగా, ఆనందంతో ఉంటామని స్వామీజీ వివరించారు. 

హంపి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతీ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతున్న ఉత్సవాలు గురువారం విగ్రహ యంత్ర ప్రతిష్టాపన, మహా కుంభాభిషేకంతో ముగియనున్నాయి. పునః ప్రతిష్ట ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి మూలవిరాట్టుకు జలాధివాసం, ధాన్యాధివాసం, ఫల పు ష్పాధివాసం, శయ్యాధివాసం కార్యక్రమాలు, శత చండీయాగ సహిత చతుర్వేద పారాయణ య జ్ఞం వేదోక్తంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు పాలెపు రామకృష్ణశర్మ వైదిక నిర్వహణలో జరుగుతున్న ఈ ఉత్సవాల్లో పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు మోటూరి రాజేంద్రప్రసాద్, ఆలయ కమిటీ చైర్మన్ ముక్క రాంప్రసాద్, మహిళా సంఘ అధ్యక్షురాలు కోటగిరి శైలజ, నిర్వాహకులు పడిగెల శ్రీనివాస్, తదితరులుపాల్గొన్నారు