calender_icon.png 4 June, 2025 | 3:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూభారతి ద్వారా ప్రతి భూ సమస్యకు పరిష్కారం

03-06-2025 12:55:17 AM

- రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 

మహబూబాబాద్, జూన్ 2 (విజయ క్రాంతి): ధరణి స్థానంలో భూభారతి చట్టం తీసుకురావడం జరిగిందని, భూభారతితో ప్రతీ భూ సమస్యకు పరిష్కారం లభిస్తుందని, ఇందుకోసం  తెలంగాణ రాష్ట్రంలో  ముందుగా నాలుగు జిల్లాలలోని 4 మండలాలను పైలట్ ప్రాజెక్టు గా తీసుకోవడం జరిగిందని, తదనంతరం 28 జిల్లాలలోని 28 మండలాలను తీసుకోవడం జరిగిందని, ఇప్పుడు జూన్ మూడవ తేదీ నుండి 20వ తేదీ వరకు 18 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని రెవెన్యూ గ్రామాల్లో దరఖాస్తులు ఇచ్చి సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలియజేశారు.

పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి తో కలిసి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం చేపట్టిన పనులు కొనసాగిస్తూనే, పేదలకోసం అనేక సంక్షేమం పధకాలు చేపట్టామన్నారు. సాధ్యమైనంతవరకు ప్రతీ గ్రామంలో అధికారులు భూ సమస్యలను, ఆగస్టు 15 నాటికి పరిష్కరించనున్నట్లు చెప్పారు.

సర్వేయర్ ల సమస్య పరిష్కారం చేసే విదంగా ప్రభుత్వం పని చేస్తుందని, లైసెన్సింగ్ సర్వేయర్ లు 6వేల మందిని తీసుకునేందుకు పదివేల మంది వద్ద దరఖాస్తులు స్వీకరించడం జరిగిందన్నారు. వీరందరికీ శిక్షణ ఇచ్చి పరీక్ష పెట్టి ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. 10,956 రెవెన్యూ గ్రామాలకుగాను 3,500 మందిని ఎంపిక చేసి పంపించినట్లు తెలిపారు. మొత్తంగా ఈ ఐదు సంవత్సరములలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. ఒకటిన్నర సంవత్సరంలోనే నాలుగున్నర లక్షల ఇళ్లు మంజూరు చేసినట్టు చెప్పారు. 400 చదరపు అడుగుల నుండి 600 చదరపు అడుగుల లోపు మాత్రమే నిర్మించుకోవాలని బిల్లులను వెంటనే చెల్లించడం జరుగుతుందన్నారు.

పేదలకు అండగా ప్రభుత్వం 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తు 500 రూపాయలకే  గ్యాస్ సిలిండర్, 10 లక్షలు తో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అమలు చేయడమే కాక హామీ ఇవ్వకపోయినా పేదల కష్టాలను దృష్టిలో ఉంచుకొని ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని సన్న బియ్యం పంపిణీ చేపట్టమన్నారు. 17 లక్షల మందిని రేషన్ కార్డులలో కొత్తగా నమోదు చేశామని, కొత్త రేషన్ కార్డులు త్వరలోనే మంజూరు చేస్తామన్నారు. యువతకు 58 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు.

సన్న రకం వడ్లకు 500 రూపాయలు బోనస్ గా ఇచ్చామన్నారు. రాజీవ్ యువ వికాస కార్యక్రమం సమగ్రంగా పరిశీలన చేసి అర్హులైన వారికి ఇవ్వాలని కొంత సమయాన్ని తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 వీజన్ తో ముందుకు సాగుతోందని, దీర్ఘకాలిక లక్ష్యాల ద్వారా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల ఆత్మ త్యాగాలు మరువలేనివని ఘనంగా నివాళులు అర్పించారు. సకల జనుల సమ్మెలో ప్రజల భాగస్వామ్యం ఎంతో గొప్పదని మంత్రి పేర్కొన్నారు.

పాలకుర్తి శాసనసభ్యులు యశస్విని రెడ్డి తో కలిసి పాలకుర్తి చౌరస్తాలో తెలంగాణ తెలుగు తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు సమర్పించి నమస్కరించారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడలో  ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ తో కలిసి నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. నూతనంగా రూపొందించిన వంగడాలకు చెందిన మినీ కిట్లను అభ్యుదయ రైతులకు అందజేశారు. పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ మార్పులతో ఉత్తీర్ణులైన విద్యార్థులను సత్కరించారు.