23-09-2025 07:04:30 PM
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లాలో నిరుద్యోగం రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో స్థానిక యువతకు పరిశ్రమల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డివైఎఫ్ఐ (డెమోక్రటిక్ యువ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక ఎస్పీఎం కంపెనీలో ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకురావడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గెడం టీకానంద్, కార్యదర్శి గొడిసెల కార్తీక్ మాట్లాడుతూ... మన జిల్లాలో పరిశ్రమలు లేకపోవడంతో యువత ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని, ఉన్న ఒక్క పరిశ్రమ ఎస్పీఎం కంపెనీ కూడా స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా బయట రాష్ట్రాల నుంచి వర్కర్లను తీసుకొస్తుండటం బాధాకరం అని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు స్పందించి యాజమాన్యంతో చర్చించి, స్థానిక యువతకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. లేదంటే స్థానిక యువతను కలుపుకొని పరిశ్రమ ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్టు హెచ్చరించారు.