calender_icon.png 29 June, 2025 | 1:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పూరీ జగన్నాథ రథయాత్రలో అపశృతి.. ఇద్దరు మృతి

29-06-2025 09:42:18 AM

ఒడిశా: ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్రలో మరోసారి అపశృతి చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున పూరీలోని గుండిచా ఆలయం వద్ద భారీగా తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఇద్దరు మహిళా భక్తులు మృతి చెందగా, 50 మందికి పైగా గాయాలయ్యాయి. స్పందించిన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

ఈ సంఘటన ఇవాళ తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో బలభద్రుడు, దేవి సుభద్ర, జగన్నాథుని మూడు రథాలు నిలిచి ఉన్న గుండిచా ఆలయానికి సమీపంలోని శారదబలి వద్ద జరిగింది. మృతులను ప్రభాతి దాస్, బసంతి సాహు, ప్రేమకాంత మొహంతిగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపించి, క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించామని పూరి జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ ఎస్ స్వైన్ తెలిపారు. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని ఆయన వెల్లడించారు.

కాగా, ఇటీవలే రథయాత్రలో ఊరేగింపుగా వచ్చిన మూడు ఏనుగుల అదుపుతప్పి ఒక్కసారిగా భక్తులపైకి దూసుకువచ్చాయి. దీంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురై పరుగులు తీయడంతో ఆ ప్రాంతంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో తోపులాట జరగడంతో పలువురు భక్తులు గాయపడినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇది మరవకముందే మరో ఘటన చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది.