29-06-2025 02:17:53 AM
మీ ప్రయాణం ‘గగన్యాన్’కు తొలి అడుగు: ప్రధాని మోదీ మాతృభూమికి దూరమైనా భారతీయుల హృదయాలకు దగ్గరగా ఉన్నారు
న్యూఢిల్లీ, జూన్ 28: శుభాంశు శుక్లా అంతరిక్ష ప్రయాణాన్ని.. భారత మానవసహిత యాత్ర ‘గగన్యాన్’కు తొలి అడు గుగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. శుక్లా అంతరిక్ష యాత్ర కేవలం రోద సికే పరిమితం కాలేదని, వికసిత్ భారత్వైపు సాగుతున్న ప్రయాణానికి కొత్త ఉత్తేజాన్ని ఇస్తుందని తెలిపారు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా నిలిచిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాతో శనివారం భారత ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించారు. మోదీ మాట్లాడుతూ.. ‘కంగ్రాట్స్ శుభాంశు.. ఇది భారత్కు గర్వకారణ మైన క్షణం. ఈ సమయంలో మీరు మాతృభూమికి దూరంగా ఉన్నా.. భారత ప్రజల మనసులకు అత్యంత దగ్గరగా ఉన్నారు.
మీ పేరులో కూడా ‘శుభ్’ ఉంది.. అది అదృష్టా న్ని సూచిస్తుంది. ప్రస్తుతం మనిద్దరమే మా ట్లాడుతున్నప్పటికీ నా వెంట 140 కోట్ల భారతీయుల భావోద్వేగాలు ఉన్నాయి. నా స్వరం లో వారి ఉత్సాహం, ఆనందం ప్రతిఫలిస్తోం ది. అంతరిక్షంలో మన భారత జెండాను ఎగరేస్తున్నందుకు ప్రత్యేక అభినందనలు. అంత రిక్షంలో మీరు ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యం బాగానే ఉందా? క్యారెట్ హల్వాను అంతరిక్షంలోని మిత్రులకు తినిపించారా’ అని మో దీ శుభాంశును అడిగారు.
దేశం తరఫున ప్రాతినిధ్యం గర్వకారణం
దీనిపై శుభాంశు శుక్లా స్పందిస్తూ.. ‘థాంక్యూ ప్రధాని మోదీ జీ.. మీతో పాటు 140 కోట్ల భారతీయుల దీవెనలు అందుకోవడం ఆనందంగా ఉంది. ప్రస్తుతానికి ఐఎస్ఎస్లో సురక్షితంగానే ఉన్నా. అంతరిక్షంలో నిద్రించడం కాస్త కష్టంగా మారింది. కానీ మెల్లిగా అలవాటు చేసుకుంటున్నా. రోజుకు 16 సార్లు సూర్యోదయం, సూర్యాస్తమయం చూస్తున్నా. ఇది నా ఒక్కడి ప్రయా ణం మాత్రమే కాదు.. మొత్తం భారత ప్ర యాణం కూడా.
భారత్ తరఫున ఐఎస్ఎస్లో ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉం ది. మీ నాయకత్వంలో ఇవాళ భారత్ తన కలలను నెరవేర్చుకోవడానికి అనేక అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. అంతరిక్ష కేంద్రానికి గజర్ కా హల్వా, మూంగ్ దాల్ కా హల్వా తీసుకొచ్చాను.
నాతో పాటు అం తరిక్ష కేంద్రంలో ఉన్న మిగతా దేశాల వ్యో మగాములకు భారత సంప్రదాయ రుచులను తినిపించా సరిహద్దులు, విభజన రేఖ లు లేని ఏకత్వ భావన కలుగుతోంది.’ అని ప్రధాని మోదీకి శుభాంశు వివరించారు.
కాగా శుభాంశు శుక్లా మరో ముగ్గురు వ్యోమగాములతో కలిసి జూన్ 25న నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి యాక్సియం మిషన్లో ఐఎస్ఎస్కు చేరుకున్న సంగతి తెలిసిందే. కెప్టెన్ శుభాంశు బృందం రెండు వారాల పాటు పలు ప్రయోగాలు నిర్వహించనుంది.
శుభాంశు సందేశం చాలా మందికి ప్రేరణ
శుభాంశుతో మాట్లాడిన అనంతరం భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోదీ మట్లాడుతూ.. శుభాంశు సందేశాం చాలా మందికి ప్రేరణ కలిగిస్తుందన్నారు. శుభాంశుతో మాట్లాడటం సంతోషంగా ఉందని, ఆయన చేసిన సాహసం చాలా మహోన్నతమైనదని పేర్కొన్నారు. గగన్యాన్ దిశగా భారత్ తొలి అడుగు విజయవంతమైందన్నారు. ఇకపై అంతరిక్ష రంగంలో భారత భవిష్యత్తు మరింత గొప్పగా ఉంటుందన్నారు.