13-11-2025 05:38:55 PM
కరీంనగర్ (విజయక్రాంతి): జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ (స్వయంప్రతిపత్తి) బి.టెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విద్యార్థిని కుమారి అన్నం హర్షిత (నెంబర్ 21271A0576) మూడు బంగారు పథకాలు సాధించింది. జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, హైదరాబాద్ 2025 డిసెంబరులో నిర్వహించనున్న 14వ స్నాతకోత్సవం సందర్భంగా మూడు ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయ బంగారు పతకాలు సాధించినందుకు విశేష గౌరవాన్ని పొందింది.
కుమారి హర్షిత 2021–25 బ్యాచ్లో తన అద్భుతమైన విద్యా ప్రదర్శనకు గాను అన్ని అనుబంధ కళాశాలలలో బి.టెక్ (సిఎస్ఈ) విభాగంలో ఉత్తమ విద్యార్థిని గా, విశ్వవిద్యాలయం, దాని అనుబంధ కళాశాలల విద్యార్థులలోమాథెమాటిక్స్ -I లో అత్యధిక మార్కులు సాధించినందుకు కీ.శే. ప్రో. పురుషోత్తం మెమోరియల్ ఎండోమెంట్ గోల్డ్ మెడల్, అన్ని అనుబంధ కళాశాలలలో బి.టెక్ (సిఎస్ఈ) విభాగంలో 8.91 సి జి పి ఏ తో ప్రథమ ర్యాంక్ సాధించినందుకు డాక్టర్ విజారాత్ రసూల్ ఖాన్ ఎండోమెంట్ గోల్డ్ మెడల్ పొందింది. ఈ బహుమతులు ఆమె అసాధారణమైన విద్యా ప్రావీణ్యం, పట్టుదల మరియు ఇంజినీరింగ్ కోర్సు మొత్తం కాలంలో నిరంతర శ్రమను ప్రతిబింబిస్తున్నాయి.
జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ శ్రీ జె. సాగర్ రావు, “మన విద్యార్థిని విశ్వవిద్యాలయ స్థాయిలో ఇంత అరుదైన గౌరవాలను అందుకోవడం జ్యోతిష్మతికి గర్వకారణం. హర్షిత విజయం ఆమె అంకితభావం, కృషి, జ్యోతిష్మతిలోని విద్యా శ్రేష్ఠతా సాంస్కృతిక వాతావరణ ఫలితమే” అని అన్నారు. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో యూనివర్సిటీ స్థాయిలో ఇప్పటివరకు మొత్తంగా 11 బంగారు పతకాలు సాధించిన ఘనత జ్యోతిష్మతికి దక్కుతుందని పేర్కొన్నారు. కుమారి హర్షిత కు రూ. లక్ష నగదు పారితోషికాన్ని బహుకరించారు. ఈ సందర్భంగా విద్యార్థిని తల్లిదండ్రులను, అధ్యాపక బృందాన్ని అభినందించారు. సెక్రటరీ, కారస్పాండెంట్ శ్రీ జె. సుమిత్ సాయి మాట్లాడుతూ కుమారి హర్షిత విజయము ప్రతిభ, అంకితమైన మార్గదర్శకత్వం మరియు సంస్థ మద్దతు కలిసినపుడు సాధించగల గౌరవప్రద ఫలితానికి సజీవ ఉదాహరణ అన్నారు. ఆమె విజయము ఇతర విద్యార్థులను ప్రేరేపించి, నాణ్యమైన విద్య, విద్యార్థుల విజయానికి జ్యోతిష్మతి కట్టుబడి ఉన్నదని మరోసారి నిరూపించింది” అని అన్నారు.