16-07-2025 12:07:09 AM
- గురుకుల పాఠశాల, కళాశాల సందర్శించిన కలెక్టర్
- కనీస సౌకర్యాలు లేవని తెలిపిన విద్యార్థులు
- ఆహారము సరిగా ఉండడం లేదు
- స్పందించిన కలెక్టర్ మను చౌదరి
మేడ్చల్, జూలై 15(విజయ క్రాంతి): గురుకుల పాఠశాల సందర్శనకు వెళ్లిన కలెక్టర్ కు విద్యార్థులు తమ గోడు వెళ్ళబోసుకున్నారు. షామీర్పేట్ మండలం తుర్కపల్లి లోని మహాత్మా జ్యోతిరావు పూలే బిసి వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలుర స్కూల్, జూనియర్ కాలేజీ నిర్వహణ తీరును కలెక్టర్ మను చౌదరి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ సమస్యలను ఏ కరువు పెట్టారు. నీటి వసతి లేక ఇబ్బంది పడుతున్నామని, గదులకు తలుపులు సరిగా లేవని, ఫ్యాన్లు లేవని తెలిపారు.
భోజనం కూడా సరిగా ఉండడం లేదని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ సైతం పాఠశాల మొత్తం పరిశీలించారు. బాత్రూమ్ లకు తలుపులు లేకపోవడం గమనించారు. నిర్వహణ సరిగా లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. నీటి ట్యాంకుకు మరమ్మతులు చేపట్టి సమస్య పరిష్కరించాలని, డోర్లు, ఫ్యాన్లు తక్షణమే రిపేరు చేయించి వాడుకలోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆహార పదార్థాలు తయారు చేయడానికి సామాగ్రి కొనుగోలు చేయాలని, మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు. వంటగదిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని, దోమలు ఈగలు రాకుండా చర్యలు తీసుకోవాలని, బియ్యము, కూరగాయలను బాగా కడగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ యాదగిరి రెడ్డి, హెడ్మాస్టర్ తదితరులు ఉన్నారు.