17-05-2025 12:00:00 AM
కలెక్టర్ ఎం హనుమంతరావు
యాదాద్రి భువనగిరి మే 16 ( విజయ క్రాంతి ): యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి 2.37 లక్షల మెట్రిక్ టన్నుల కొను గోళ్లు విజయవంతంగా పూర్తి చేయగలిగామని రానున్న పక్షం రోజుల్లో సుమారు ఒక లక్ష టన్నులపైగా ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు.
యాసంగి 2024-25 వరి ధాన్యం కొనుగోళ్ల తీరుపై రాష్ట్ర మంత్రుల బృందం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది . చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు పౌరసరఫరాల కమిషనర్ దేవేందర్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రులు పౌరసరఫరాల శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు , కార్మిక రోడ్డు రవాణా శాఖ పొన్నం ప్రభాకర్ లు , రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు తీరును జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా నుండి అదనపు కలెక్టర్ వీరారెడ్డి తో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఈ సీజన్ కు సంబంధించి ఇప్పటికే 452 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని తెలిపారు. అకాల వర్షాల దృష్ట్యా , ఇంకా ఎక్కువ ధాన్యం కుప్పలు ఉన్న కేంద్రాలను గుర్తించి, ఆయా కేంద్రాలకు ప్రత్యేక అధికారులను నియమించి కొను గోళ్లను త్వరితగతిన చేపడుతున్నామన్నారు వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి , జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి, రోజారాణి , పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ హరికృష్ణ , డి ఆర్ డి ఓ నాగిరెడ్డి , డి సి ఓ మురళి , డి ఏ ఓ గోపాల్ , జిల్లా మార్కెటింగ్ అధికారి సబిత ఇతర అధికారులు పాల్గొన్నారు.