07-09-2025 12:11:51 AM
కొత్తపల్లి,(విజయక్రాంతి): ప్రస్తుత కాలంలో విద్యార్థులకు క్రీడలతో ఉజ్వల భవిష్యత్ ఉంటుందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. శనివారం కరీంనగర్ అర్బన్ క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో మానేరు విద్యాసంస్థల సౌజన్యంతో కరీంనగర్ పద్మనగర్లోని మానేరు సీబీఎస్ఈ పాఠశాలలో నిర్వహించిన ఎస్జీఎఫ్ అర్బన్ కబడ్డీ పోటీలను ఆయన లాంచనంగా ప్రారంబించారు. అంతకుముందు ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడా పతాకాన్ని ఆవిస్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యతను ఇస్తుందన్నారు.
నూతన క్రీడా పాలసీతో పాటు స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తుండడం గర్వకారణమన్నారు. జిల్లాలో మానేరు విద్యాసంస్థలు క్రీడారంగాని చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా విద్యాసంస్థల ఆధ్వర్యంలో జాతీయ, రాష్ట్ర పోటీలు జరుగడం ఆనందించదగ్గ విషయమన్నారు. క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ పోటిల్లో రాణించి జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. సుడా పరంగా జిల్లాలో క్రీడారంగ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తామన్నారు.
మానేరు విద్యాసంస్థల ఆధినేత కడారి అనంతరెడ్డి మాట్లాడుతూ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలో విద్యతో పాటు క్రీడలకు సముచిత స్థానాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. క్రీడల్లో రాణించిన వారు అన్ని రంగాల్లో రాణిస్తారన్నారు. భవిష్యత్లో మానేరు విద్యాసంస్థల ఆధ్వర్యంలో జాతీయ పోటీల నిర్వాహణకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అనంతరం సుడా చైర్మన్ క్రీడాకారులు పరిచయం చేసుకొని పోటీలను ప్రారంబించారు. ఈ సందర్బంగా ఆయన కాసేపు అతిథులతో సరదాగా కబడ్డీ ఆడి సందడి చేశారు.