22-10-2025 01:36:10 AM
టీజేఎస్కు కాంగ్రెస్ లేఖ
హైదరాబాద్, అక్టోబర్ 21 (విజయక్రాంతి) : జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతు ఇవ్వాలని తెలంగాణ జన సమితిని కాంగ్రెస్ పార్టీ కోరింది. ఈ మేరకు మంగళవారం టీజేఎస్ చీఫ్ కోదండరాంకు పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ లేఖ రాశారు. ‘గత బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ఎంతటి విధ్వంసానికి పాల్పడ్డారో మీకు బాగా తెలుసు. ఉద్యమకారుడు, టీజేఎస్ అధ్యక్షుడిగా ఉన్న మిమ్నల్నీ ఒక ఉగ్రవాది మాది రిగా అరెస్టు చేసిన ఉదంతాలు తెలంగాణ సమాజం ఇంకా మరిచిపోలేదు’ అని లేఖ లో ఆయన పేర్కొన్నారు.
టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చుకుని తెలంగాణతో ఉన్న పేగు బంధాన్ని తెంపుకుందని పార్టీ పేరులో తెలంగాణ పేరు లేకుండా కేసీఆర్ తన తెలంగాణ వ్యతిరేకతను ప్రదర్శించుకున్నారని ఆరోపించారు. గత 22 నెలలు రాష్ర్టంలో రేవంత్రెడ్డి నేతృత్వంలోని ప్రజాపాలన రాష్ర్ట ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుస్తోందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తోందని వివరించారు. ఇలాంటి తరుణంలో వచ్చిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక అత్యంత కీలకమైనదని, ఈ సమయంలో బీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం మన అందరి బాధ్యత అని పేర్కొన్నారు. అందుకోసం తమ సంపూర్ణ సహకారం అందించాలని ఆయన కోరారు.