22-10-2025 01:33:17 AM
శేరిలింగంపల్లి, అక్టోబర్ 21 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మూడు కమిషనరేట్ల పరిధిలో సెల్ఫోన్లను చోరీ చేస్తున్న ముఠాలో ఆరుగురు నిందితులను మియాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాధాపూర్ జోన్ డిసిపి తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్కు చెందిన మూడు కమిషనరేట్ల పరిధిలో సెల్ఫోన్ చోరీలకు పాల్పడుతున్న ముఠాకు చెందిన నింది తులను అరెస్ట్ చేసి వారి నుంచి 20మొబైల్స్, ఆటో, 2 యాక్టివా స్కూటీలు, రూ.2.50లక్షలు నగదు స్వాధీనం చేసుకోవడం జరిగింద న్నారు.
ప్రధాన నిందితుడు హైదరాబాద్ కు శాలిబండకు చెందిన మహ్మద్ ఐజాజ్(35) ఆటోడ్రైవర్, కాలాపత్తర్కు చెందిన మిర్జా ఫరూక్ బేగ్(26), బహదూర్పురాకు చెందిన సయ్యద్ సాజిద్ (33), పహాడిషరీఫ్కు చెందిన మహ్మద్ అమీర్ (26),తలాబ్ కట్టకు చెందిన సయ్యద్ ఒమర్ (29), ఫలక్నామకు చెందిన అబ్దుల్ నవీద్(48) లు ముఠాగా ఏర్పడి సెల్ఫోన్ చోరీలకు పాల్పడుతున్నారని వివరించారు.
ఈ నెల 18న ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టి మియాపూర్ పోలీసులు చాకచక్యంగా నిందితులను అదుపు లోకి తీసుకున్నారని తెలిపారు. ప్రధాన నిందితుడు ఎజాజ్ బస్ స్టాప్ లలో ఆటో కోసం వేచి ఉన్న ప్రయాణకులను తన ఆటో లో కూర్చోబెట్టుకొని ముందుగానే పథకం ప్రకారం ఆటోలో ఉన్న తన అనుచరుల ఆటోలో ఎక్కిన ప్రయాణికుల ఫోన్లను తస్కరించేలా చేస్తాడని, వీరంతా ఓల్ సిటీ కేంద్రంగా ఈజీ మనీ కోసం గతంలో పలు నేరాలకు పాల్పడినట్లుగా గుర్తించడమైనదని తెలిపారు.