06-09-2025 12:00:00 AM
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
అదిలాబాద్, సెప్టెంబర్ 5 (విజయ క్రాం తి): ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో వినాయక నిమజ్జనోత్సవానికి భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. అడుగడుగునా పోలీసులు... సీసీ కెమెరాల నిఘాలో నిమజ్జన శోభాయాత్ర ను ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసేందుకు అన్ని పకడ్బందీ గా ఏర్పాట్లు చేపట్టామన్నారు.
నిమజ్జనం సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం పోలీస్ అధికారులతో శాంతి భద్రతల పై ఎస్పీ సమీక్షించారు. ఈ సందర్భంగా నిమజ్జన శోభాయాత్ర రూట్ మ్యాప్ ను, సీసీ కెమెరాల ఏర్పాటు ను పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ నిమజ్జనం కోసం 600 మంది పోలీసు సిబ్బందితో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
ప్రత్యేకంగా 350 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి 24 గంటలు కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. పట్టణంలో 8 క్లస్టర్లు, 8 సెక్టార్లుగా విభజించిన సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రశాంత వాతావరణంలో గణపతి ఉత్సవాలను పూర్తి చేసుకొని నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.