07-06-2025 12:47:20 AM
సీపీ సాయి చైతన్య
నిజామాబాద్ జూన్ 6:(విజయ క్రాంతి): చట్టాన్ని అతిక్రమించి అక్రమాలకు పాల్పడుతున్న సిబ్బందిపై కఠినమైన చర్యలను నిజామాబాద్ జిల్లా పోలీస్ శాఖ కమిషనర్ సాయి చైతన్య తీసుకుంటున్నప్పటికీ సిబ్బంది అధికారుల కంటపడకుండా అక్రమ సంపాదనకు అలవాటు పడ్డారు. వడ్డీ వ్యాపారుల విషయంలో నిజామాబాద్ సీపీ సాయిచైతన్య కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అందులోనూ ప్రత్యేకించి పోలీసులు వడ్డీ దందాలు నిర్వహిస్తే ఏమాత్రం సహించడం లేదు.
ప్రత్యేకంగా క్రిమినల్ కేసులు నమోదు చేయించడమే కాకుండా సస్పెండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కమిషనరేట్లో మరో కానిస్టేబుల్పై సస్పెన్షన్ వేటు పడింది. వివరాల్లోకి వెళ్తే మెండోరా పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ గంగాధర్ వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదులున్నాయి. బాధితుల ఫిర్యాదు మేరకు నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదయ్యాయి. అనంతరం విచారణ చేపట్టారు.
నివేదిక అందిన తదుపరి తాజాగా సీపీ చర్యలు తీసుకున్నారు. సదరు కానిస్టేబుల్ను సస్పెండ్ చేస్తూ రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. కాగాగడిచిన రెండు నెలల వ్యవధిలో కమిషనరేట్ పరిధిలో ముగ్గురు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు పడింది. వీరిలో ఇద్దరు వడ్డీ వ్యాపారం నిర్వహించే వారు కాగా ఒకరు ఉద్యోగాల పేరిట డబ్బుల వసూలుకు పాల్పడినట్లు తెలుస్తోంది.