calender_icon.png 10 November, 2025 | 2:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నా కొడుకు మరణంపై అనుమానాలు ఉన్నాయి

09-11-2025 10:54:56 PM

గోపీనాథ్ తల్లి మహా నందకుమారి 

ఖైరతాబాద్ (విజయక్రాంతి): దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతిపై అనుమానాలు ఉన్నాయని ఆయన తల్లి మహానంద కుమారి అన్నారు. ఆయన ఎప్పుడు చనిపోయారన్నది తల్లిగా తనకే తెలీదన్నారు. ఈ మేరకు ఆదివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మాగంటి మొదటి భార్య మాలిని, ఆమె కుమారుడు తారక్తో కలిసి మహానంద కుమారి మాట్లాడారు. కేటీఆర్ వచ్చిన తర్వాత మరణవార్తను బయటకు చెప్పారని అన్నారు. 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై గొప్ప పేరు తెచ్చుకున్న గోపీనాథ్ ఆస్పత్రిలో ఉంటే ఒక్క రోజు కూడా చూడటానికి టైమ్ ఇవ్వలేదని అన్నారు. ఒక్క అటెండర్ను కూడా పెట్టలేదని, గోపీనాథ్ జూన్ 8న చనిపోయారని చెప్పారు. లీగల్ హెయిర్ సర్టిఫికెట్లో మొదటి భార్య, బిడ్డలు, నా పేరు కూడా లేదన్నారు. మొదటి భార్యతో విడాకులు కూడా కాలేదని, తాము గోపీనాథ్తో సునీత పెళ్లి చేయలేదని తెలిపారు.

ఫ్యామిలీ సర్టిఫికెట్లో మా పేరు లేదని, కేటీఆర్ వెంట పరుగెత్తి నాకు జరిగిన అన్యాయం గురించి చెప్పాలనుకుంటే ఆయన కూడా వినలేదన్నారు. ఇది డబ్బు సమస్య కాదని, మాకు గుర్తింపు లేదని, అందుకే మీడియా ముందుకొచ్చాం అని వివరించారు. సునీతకు టికెట్ ఇచ్చేటప్పుడు కేటీఆర్ తమకు కనీసం సమాచారం ఇవ్వలేదన్నారు. నాకు 93 ఏళ్ల వయసులో ఇలా బయటకు రావడం బాధగా ఉందన్నారు. ఏ పార్టీతో సంభందం లేదని, తమకు అన్యాయం జరిగిందన్నారు. గోపీనాథ్ మొదటి భార్య, కుమారుడికి గుర్తింపు ఉండాలి కదా అని అన్నారు. ఆమె ఎన్నో అవమానాలు పడిందన్నారు. వద్దు అనుకుంటే మొదటి భార్యతో ఎప్పుడో విడాకులు తీసుకునేవాడని, అలా జరగలేదంటే సాఫ్ట్ కార్నర్ ఉన్నట్లే కదా అని అన్నారు. నలుగురిలో నిరూపించుకోవాలనే బయటకు వచ్చాం అన్నారు. నా పెద్ద కొడుకు కూడా టికెట్ కోసం ప్రయత్నించాడని, గోపీనాథ్ తల్లిగా నాకు అడగాల్సిన హక్కులేదా లీగల్ హెయిర్ సర్టిఫికెట్లో మా పేర్లు లేవని ఆగస్టు 11 నుంచి తహసీల్దార్ కార్యాయానికి వెళ్లి వస్తున్నాం అన్నారు. ఈ సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదని అన్నారు.

లీగల్ హెయిర్ సర్టిఫికెట్లో తమ పేర్లను పెట్టాలి

మాగంటి కుమారుడు తారక్ ప్రద్యుమ్న

నా పాస్పోర్ట్, ఇతర పత్రాల్లో తండ్రిగా గోపీనాథ్ పేరే ఉంది. చట్ట పరంగా కూడా అన్ని సక్రమంగా ఉన్నాయి. ఎమ్మార్వో ఆఫీస్ లో కూడా సబ్మిట్ చేశాను. మా అమ్మతో చట్టపరంగా విడాకులు కాలేదు. తారక్ అంటే ఎవరో తెలియదన్న మాగంటి సునీత జూన్ 6న నాకు మొదటి సారి ఫోన్ చేశారు. ఎవరో తెలియకపోతే ఎందుకు ఫోన్ చేసినట్లు అని ప్రశ్నించారు. గ్రాడ్యుయేషన్ డేకి రావాలని మా నాన్న అనుకున్నారు. కానీ, హఠాత్తుగా చనిపోయారు. సునీత నాకు ఫోన్ చేసి నువ్వు ఇండియా రావాల్సిన అవసరం లేదు. రెజ్యూమె పంపించు కేటీఆర్ అంకుల్ కంపెనీస్లో ఉద్యోగం ఇప్పిస్తామన్నారు. మా పెద్దనాన్న మీద అనవసర ఆరోపణలు చేస్తున్నారు. జూన్ 25న ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం అప్లై చేశారు.  అప్పుడు అఫిడవిట్లో ఎవరి పేర్లు పెట్టారో నాకు తెలియదు. మా అమ్మ, నాన్నమ్మ, నా పేర్లను లీగల్ హెయిర్ సర్టిఫికెట్లో పెట్టాలని కోరారు.