అంతర్జాతీయ ప్రమాణాలతో స్వామి నారాయణ్ గురుకుల పాఠశాల
- రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
- రఘునాథపాలెం మండలం జింకలతాండలో 13 ఎకరాల్లో గురుకుల పాఠశాల
- నిరుపేద విద్యార్థులకు 10 శాతం ఉచిత సీట్లు
- స్వామి నారాయణ్ గురుకుల పాఠశాల నిర్మాణ పనులకు భూమిపూజ, శంకుస్థాపన
ఖమ్మం, ఆగస్టు 26 (విజయక్రాంతి): గిరిజన ప్రాంతంలో విద్యా ప్రమాణాలను మరింత పెంచడంతో పాటు, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలతో పాటు చుట్టుపక్కల జిల్లాల విద్యార్థులకు సైతం నాణ్యమైన, విలువలతో కూడిన విద్యను అందించే దిశగా రఘునాథపాలెం మండలం జింకలతండాలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్వామినారాయణ గురుకుల పాఠశాల నిర్మాణానికి రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ తో కలిసి బుధవారం భూమిపూజ, శంఖుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, 13.10 ఎకరాల్లో స్వామి నారాయణ గురుకుల్ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న ఈ పాఠశాలలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యాబోధన అందించనున్నారన్నారు. సుమారు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో పాఠశాల భవనాలు, విద్యార్థులకు అవసరమైన ఆధునిక సౌకర్యాలతో క్యాంపస్ రూపుదిద్దుకోనుందని తెలిపారు. విద్యతో పాటు మానవతా విలువలు, సంస్కృతి, సంప్రదాయాలు, కుటుంబ వ్యవస్థ, నైతిక విలువలకు ప్రాధాన్యం ఇచ్చే విధంగా విద్యాబోధన సాగనుందని మంత్రి తెలిపారు.
ఆధునిక విద్యతో పాటు భారతీయ విలువలను విద్యార్థుల్లో పెంపొందించేలా గురుకుల్ విద్యా విధానం ఉండనుందన్నారు. తెలంగాణలో స్వామినారాయణ గురుకుల్కు ఇది 5వ విద్యాసంస్థ అని మంత్రి అన్నారు. పాఠశాలలో అందుబాటులో ఉండే సీట్లలో 10 శాతం సీట్లను ఎలాంటి ఫీజు లేకుండా నిరుపేద విద్యార్థులకు కేటాయించే అధికారాన్ని జిల్లా కలెక్టర్కు అప్పగించారన్నారు. దీంతో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన పిల్లలు కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను పొందే అవకాశం లభించనుందని తెలిపారు.
గిరిజన ప్రాంతాలతో పాటు ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు నాణ్యమైన విద్యను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ఈ విద్యాసంస్థ ఏర్పాటు జరుగుతోందని మంత్రి తెలిపారు. ఆధునిక విద్యతో పాటు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, మానవతా విలువలను విద్యార్థుల్లో పెంపొందించాల్సిన అవసరం ఉందని, స్వామినారాయణ గురుకుల్ విద్యా విధానం ఈ లక్ష్యానికి అనుగుణంగా ఉంటుందని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ పువ్వాల్ల దుర్గాప్రసాద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ ఖాదర్ బాబా, ఆర్ అండ్ బి ఎస్ఇ యుగంధర్ రావు, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, ఖమ్మం ఆర్డీవో ఎన్. శ్రీనివాస్, స్వామీ నారాయణ్ గురుకుల్ ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.






