27-09-2025 03:43:45 PM
మాగనూరు: మాగనూరు మండలం పరిధిలోని తాళంకేరి గ్రామ పంచాయతీ పురాతన భవనం కూలడానికి సిద్ధంగా ఉందని గ్రామస్తులు, పంచాయతీ కార్యదర్శి అనిత తెలిపారు. గత 40 సంవత్సరాల క్రితం గ్రామంలో పాఠశాల కోసం నిర్మించిన భవనాన్ని నూతన తాళంకేరి గ్రామం గ్రామపంచాయతీగా ఏర్పడిన తర్వాత గ్రామపంచాయతీ కార్యాలయం కోసం ఆ యొక్క పాఠశాల భవనమును గ్రామ పంచాయతీ భవనముగా ఏర్పాటు చేసుకోని విధులు నిర్వహిస్తున్నారు.
ఈ సంవత్సరం వర్షాకాలంలో అధిక వర్షం కురవడం వల్ల గ్రామ పంచాయతీ భవనం పెచ్చులూడిపడుతోందని, నీరు కారుతోందని, గోడలు కూలడానికి సిద్ధంగా ఉందని పంచాయతీ కార్యదర్శి అనిత తెలిపారు. ఎప్పుడు కూలి పడుతుందోనని భయంతో ఈ యొక్క కార్యాలయంలోనే విధులు నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. కొత్త గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులను కాంట్రాక్టర్లుకు బిల్లులు రాక మధ్యలోనే నిర్మాణ పనులను నిలిపివేశారని కార్యదర్శి తెలిపారు. గ్రామపంచాయతీ భవన శిథిలావస్థ గురించి ఎంపీడీవో శ్రీనివాసులుకి విషయం తెలపడం జరిగిందని పంచాయతీ కార్యదర్శి తెలిపారు.