03-11-2025 02:10:36 AM
హైదరాబాద్, నవంబర్ 2 (విజయక్రాంతి): డిసెంబర్ 9 వరకు పెండింగ్ డీఏ బకాయిలు, బిల్లులు, సమస్యలు పరిష్కరించాలని, తర్వాత పీఆర్టీయూటీఎస్ ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని టీచర్ ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో పీఆర్టీయూటీఎస్ 36వ సాధారణ సర్వసభ్య సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగుల ఈహెచ్ఎస్ పథకంపై నెలలోపు ఉత్తర్వులు జారీ చేయాలని, సీపీఎస్ రద్దు చేయాలని, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 పద్దు కింద వేతనాలు చెల్లించాలని, కేజీబీవీ, ఎస్ఎస్ఏ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని ఆయన హెచ్చరించారు.
ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ బీ మోహన్ రెడ్డి, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పుల్గం దామోదర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుంకరి బిక్షంగౌడ్తోపాటు రాష్ట్ర నాయకులు, 33 జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, 1,500 మందికి పైగా టీచర్లు పాల్గొన్నారు.