10-12-2025 12:45:35 AM
మహబూబాబాద్ జిల్లాలో ఏర్పాటు
మహబూబాబాద్, డిసెంబర్ 9 (విజయ క్రాంతి): తొలి విడత పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అనేక గ్రామాల్లో పోలింగ్ నిర్వహణకు భవనాలు లేక అధికారులు తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభుత్వం తండాలను పంచాయతీలుగా చేయడంతో పాటు 500 జనాభాకు మించిన ఆవాస ప్రాంతాల్లో కొత్త పంచాయతీలను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో అనేక కొత్త పంచాయతీల్లో తక్కువలో తక్కువ ఆరు నుంచి పది వార్డు సభ్యుల ఎన్నికలతో పాటు సర్పంచ్ పదవికి ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
కొత్త పంచాయతీల్లో పోలింగ్ నిర్వహణకు ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు లేవు. అక్కడక్కడ ప్రభుత్వ పాఠశాలలు ఉన్నప్పటికీ ఒకటి రెండు గదులు మాత్రమే ఉండటంతో తాత్కాలికంగా పోలింగ్ నిర్వహణ కోసం అధికారులు టెంట్లు, పరదాలతో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. వార్డుకు ఒకటి చొప్పున టెంట్ తో ప్రత్యేక గదులుగా మారుస్తున్నారు. ఓటు వేసే ఛాంబర్ ఇతరులకు కనిపించకుండా ఉండడా నికి , ఓటర్లకు కనీస సౌకర్యాల కోసం ఎన్నికల అధికారులు ఏర్పాట్లలో తల మునకలయ్యారు.