చిరుతను తప్పించబోయి కారు బోల్తా
- భార్య మృతి.. భర్తకు తీవ్రగాయాలు
- నిజామాబాద్ జిల్లాలో ఘటన
నిజామాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): అకస్మాత్తుగా కారుకు అడ్డుగా వచ్చిన చిరుతను తప్పించే యత్నంలో కారు బోల్తా పడగా, భార్య మృతి చెందగా, భర్త తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన నిజామాబాద్ జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి తర్వాత చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం యాచారానికి చెందిన దంపతులు మాలోత్ ప్రభాకర్ లలిత (30) మంగళవారం రాత్రి నిజామాబాద్ జిల్లాలో ఉన్న తమ బంధువుల ఇంటికి వచ్చారు.
తిరుగు ప్రయాణంలో నిజామాబాద్ జిల్లాలోని మోపాల్ మండలం ఎల్లమ్మకుంట గ్రామ శివార్లలో అకస్మాత్తుగా ఓ చిరుత వారి కారుకు అడ్డుగా వచ్చింది. చిరుతను తప్పించే యత్నంలో కారును పక్కకు తిప్పగా బోల్తా కొట్టింది. లలిత అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడ్డ ప్రభాకర్ను నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మోపాల్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు.






