కాంగ్రెస్ సమావేశం రసాభాస

02-05-2024 12:57:36 AM

సమావేశం నుంచి ఎంపీ అభ్యర్థి కావ్య వాకౌట్

వరంగల్, మే 1 (విజయక్రాంతి): వరంగల్ ఓ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం రాష్ట్ర అటవీశాఖ మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య అధ్యక్షతన నిర్వహించిన  పార్టీ తూర్పు నియోజకవర్గ సమావేశం అంతర్గత విభేదాలతో రసాభాసగా మారింది. పార్టీలో సీనియర్ నేతలకు సముచితమైన గౌరవం లేదని, నిన్నమొన్న పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యం ఉంటుందని పలువురు నాయకులు మంత్రిని ప్రశ్నించారు. దీంతో ఇటీవల పార్టీలో చేరిన వారికి, సీనియర్ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఒకదశలో రెండువర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. నాయకులకు సర్దిచెప్పినా వినకపోవడంతో ఎంపీ అభ్యర్థి కావ్య సమావేశం మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు. ఇటీవల కాంగ్రెస్ నిర్వహించిన పాలకుర్తి, పరకాల నియోజకవర్గస్థాయి సమావేశాల్లోనూ విభేదాలు తలెత్తడం గమనార్హం. మరికొద్ది రోజుల్లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ఉండగా పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడుతుండడం పార్టీ అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది.