ఫార్మ్ పాండ్ల నిర్మాణాన్ని విస్తృతంగా చేపట్టాలి
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
గాంధారి, ఆగస్టు 5 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పోతంగల్ కుర్దు, సీతాయిపల్లి గ్రామాలను సందర్శించారు.. పోతంగల్ కుర్దు గ్రామ పంచాయతీ పరిధిలో వీబీ-జి రామ్-జి పథకం కింద చేపట్టిన ఫార్మ్ పాండ్ మరియు కొబ్బరి బండ్ ప్లాంటేషన్ పనులను పరిశీలించారు.. ఈ సందర్భంగా సంబంధిత రైతుతో మాట్లాడి ఫార్మ్ పాండ్ వల్ల కలుగుతున్న లాభాల గురించి అడిగి తెలుసుకున్నారు.
అనంతరం అన్ని గ్రామ పంచాయతీల్లో అర్హులైన రైతులను గుర్తించి పెద్ద ఎత్తున ఫార్మ్ పాండ్ల నిర్మాణాలు చేపట్టాలని, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు మరియు రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా ఈ పనులను వేగవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
భుభారతి రీ సర్వే పనుల పరిశీలన
అంతరం సీతాయిపల్లి గ్రామంలో కొనసాగుతున్న భూ భారతి రీ సర్వే పనులను పరిశీలించారు. రీ సర్వే పనులు నిర్ధేశిత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం ఐకెపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏకరూప దుస్తుల తయారీని పరిశీలించి పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఆర్డీఓ ప్రభాకర్, పోతంగల్ కుర్దు సర్పంచ్ సంతోష్, సీతాయిపల్లి సర్పంచ్ అంజద్ ఖాన్, తహసీల్దార్ రేణుకా చౌహాన్, ఎంపీడీవో రాజేశ్వర్, ఏడి శ్రీనివాస్, ఏపీఎం ప్రసన్న కుమార్, ఏపిఓ మధు, సాంకేతిక సహాయకుడు నరేష్ , గ్రామ ప్రజలు పాల్గొన్నారు.






