మహాలో వివాదాస్పదైన శివాజీ విగ్రహం ఘటన
- తొమ్మిది నెలల క్రితం మోదీ చేతులమీదుగా ఆవిష్కరణ
- నాణ్యతా ప్రమాణాలపై రాష్ట్రప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలు
ముంబై, ఆగస్టు 27: మహారాష్ట్రలోని సింధ్దుర్గ్ జిల్లా మాల్వాన్లోని రాజ్కోట్లో గతేడాది డిసెంబర్ 4న ప్రధాన మంత్రి మోదీ ప్రతిష్ఠాత్మకంగా ఆవిష్కరించిన 35 అడుగుల ఛత్రపతి శివాజీ విగ్రహం సోమవారం కుప్పకూలింది. ఎడతెరిపి లేని వర్షాల కారణంగానే విగ్రహం కూలి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. త్వరలో నిపుణులు విగ్రహం కూల్చివేతపై స్పష్టత ఇస్తారని ప్రకటించారు. విగ్రహం ఆవిష్కరించిన తొమ్మిది నెలలకే కుప్ప కూలడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
ప్రభుత్వ హడావుడిగా విగ్రహ నిర్మాణం పూర్తి చేయించి, ప్రధాని మోదీతో ఆవిష్కరింపజేశారని విమర్శిస్తున్నారు. సీఎం ఏక్నాథ్ షిండేకు ప్రచారంపై ఉన్న దృష్టి విగ్రహ నిర్మాణం, నాణ్యతా ప్రమాణాలపై లేకపోయిందని ఆరోపిస్తున్నారు. మరోవైపు విగ్రహం కూలడానికి కొద్దిరోజుల ముందే రాష్ట్ర పబ్లిక్ వర్క్స్ విభాగానికి చెందిన అసిస్టెంట్ ఇంజినీర్ విగ్రహం నాణ్యతపై హెచ్చరిస్తూ ఆగస్టు 20న నావికా దళ ఉన్నతాధికారికి లేఖ రాశారనే విషయం బయటకు వచ్చింది. అయినప్పటికీ సద రు అధికారి నుంచి ఎలాంటి స్పందన లేదని ఇంజినీర్ వెల్లడిస్తున్నారు. జూన్ లో జయదీప్ అనే శిల్పి విగ్రహానికి మరమ్మతులు చేసినప్పటికీ ఫలితం లేకపో యిందని ఇంజినీర్ లేఖలో పేర్కొన్నారు.
అదే స్థలంలో మరో విగ్రహం నిర్మిస్తాం: డిప్యూటీ సీఎం
ఛత్రపతి శివాజీ విగ్రహం కుప్పకూలడంపై మంగళవారం డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. విగ్ర హం నిర్మాణ సమయంలో నావికా దళం గానీ, రాష్ట్రప్రభుత్వం గానీ నాణ్యతా ప్రమాణాలను పరిశీలించలేదని కుండబద్దలు కొట్టారు. బలమైన ఈదురు గాలులతో పాటు భారీ వర్షాల కారణంగానే విగ్రహం కుప్పకూలిందని స్పష్టం చేశారు. విగ్రహం కూలడంపై పారదర్శకంగా విచారణ చేపడతామన్నారు. కూలిన చోటే త్వరలో మరో శివాజీ విగ్రహం నిర్మిస్తామన్నారు. ఈసారి పక్కాగా నాణ్యతా ప్రమాణాలు పాటించి రాష్ట్రప్రభుత్వమే విగ్రహం నిర్మిస్తుందని స్పష్టం చేశారు.




