19-12-2025 12:50:55 AM
కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
నిజామాబాద్, డిసెంబర్ 18 (విజయ క్రాంతి): అందరి సహకారంతో జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పర్యవేక్షణలో జిల్లాలో మూడు విడతలలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు సాఫీగా ముగిసిన నేపధ్యంలో గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ ను, ఇతర నోడల్ అధికారులను జిల్లా పంచాయతీ అధికారి డి.శ్రీనివాస్ రావు సత్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అధికారులు, సిబ్బంది అందరూ పరస్పర సమన్వయంతో కృషి చేసిన ఫలితంగా ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించుకోగలిగామని అన్నారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలోనూ ఇదే తరహాలో సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన అందరికీ జిల్లా యంత్రాంగం తరపున కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.