కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యం
పీపీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్
హైదరాబాద్, జూన్ 19 (విజయక్రాంతి) : కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పని చేయాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్ పిలుపునిచ్చారు. బూత్ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేయాలని, అందుకు ప్రతి కార్యకర్త నిరంతరం ప్రజలతో మమేకం కావాలని సూచించారు. ఆదివారం గాంధీభవన్లో నిర్వహించిన సంఘటన్ సృజన్ అభియాన్, ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమాల్లో పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, టీపీసీసీ ట్రైనింగ్ ఇంచార్జ్ రాంమోహన్ రెడ్డి, సార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహేష్కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో మరింత చురుకుగా ముందుకెళ్లి సంఘటన్ సృజన్ అభియాన్ను విజయవంతం చేయాలన్నారు. సర్లో కాంగ్రెస్కు సంబంధించిన ఓట్లు ఒక్కటి కూడా పోకుండా పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్లు కీలకంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన విమర్శలను ఆయన ఖండించారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఇచ్చిన హామీలను ఓసారి గుర్తు చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం రెండున్నరేళ్లలో చేసిన అభివృద్ధికి, బీజేపీ 12 ఏళ్ల అభివృద్ధిపై చర్చక సిద్ధమా? అని రాంచందర్రావు సవాల్ విసిరారు.






