05-06-2025 12:48:22 AM
ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి
యాచారం జూన్ 4 :రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు.బుధవారం యాచారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఉద్యాన పంటలు మార్కెటింగ్ తదితర అంశాలపై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, ఎమ్మెల్యే రంగారెడ్డి పాల్గొని మాట్లాడుతూ..
రైతులు నాణ్యమైన విత్తనాలు వాడి పంట దిగుబడి అధిక మొత్తంలో సాధించవచ్చని తెలిపారు. రైతులకు మార్కెటింగ్ తదితర అంశాలపై తమ ప్రభుత్వము తగిన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. అనంతరం ఉద్యానవన పంటల మార్కెట్ కై ఆర్డీవో అనంతరెడ్డి తో కలిసి స్థల పరిశీలన చేశారు.
కార్యక్రమంలో, వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఐఏఎస్ గోపి, సభ్యులు మారకంటి భవాని, వ్యవసాయ అధికారి ( కమిషన్) హరి వెంకట ప్రసాద్, అడిషనల్ డైరెక్టర్ రవి కుమార్, ఏడిఏ సుజాత మండల వ్యవసాయ అధికారి రవినాథ్, తదితరులు పాల్గొన్నారు.
రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోండి..
ఇబ్రహీంపట్నం, జూన్ 4:రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. బుధవారం ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని ఖానాపూర్ గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హాజరై మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు.
చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. భూహక్కులు కలిగి ఉన్న వారికి ఈ చట్టం ద్వారా తగు న్యాయం జరుగుతుందన్నారు. గత పాలకులు అసైన్డ్, వక్స్బోర్డు, సీలింగ్, భూదాన్, ఎండోమెంట్ భూములను కొల్లకొట్టారన్నారు. ఆ భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకొని, పేదలకు పంచుతామని తెలిపారు. ఈ ప్రాంతంలో వందలకోట్ల విలువ చేసే..
వందలాది ఎకరాల ప్రభుత్వ భూములను అక్రమార్కులు అక్రమంగా ఆక్రమించుకున్నారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఆర్డివో అనంతరెడ్డి, తహసీల్దార్ సునీత రెడ్డి, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులుపాల్గొన్నారు. అనంతరం ఇబ్రహీంపట్నం క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకుపంపిణీచేశారు.