05-06-2025 12:47:23 AM
పోరండ్ల రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే కవ్వంపల్లి
తిమ్మాపూర్ జూన్ ౪ (విజయక్రాంతి): ధరణి వల్ల రైతులు ఎదుర్కొంటున్న భూ సంబంధిత సమస్యలు భూ భారతి చట్టంతో సమసిపోతాయని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు.
తిమ్మాపూర్ మండలం పోరండ్ల గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెచ్చిన ధరణి వల్ల రైతులు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారని ధరణి లోని లొసుగులను అవకాశంగా చేసుకొని గ్రామాల్లో కొందరు ఆక్రమణలకు తెగబడ్డారని, మరికొందరు అక్రమ బదలాయింపులకు దౌర్జన్యంగా పాల్పడ్డారన్నారు. దీంతో గ్రామాల్లో భూవివాదాలు పెచ్చుమీరి,హత్యలకు దారితీసిన సంఘటలు కూడా చోటుచేసుకున్నాయన్నారు.
ప్రభుత్వం తీసుకు వచ్చిన భూభారతి చట్టంతో రైతుల చిక్కులు తీరుతాయని పదేళ్లుగా ఎదుర్కొంటున్న భూసమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకు వచ్చిందని ఆయన వివరించారు.రైతులకు భూభారతి వరం లాంటిదని రైతులకు సర్వరోగ నివారణిగా భూభారతి పని చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఎవరికైనా భూసంబంధ సమస్యలు ఉంటే ఈనెల 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఈ సదస్సులో తిమ్మాపూర్ మండల తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధగోని లక్ష్మినారాయణ గౌడ్, తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బండారి రమేశ్, పార్టీ నాయకులు మోరపల్లి రమణారెడ్డి, చింతల లక్ష్మారెడ్డి, ద్యావ శ్రీనివాస్ రెడ్డి, పోతుగంటి శ్రీనివాస్ తదితరులుపాల్గొన్నారు.