calender_icon.png 9 September, 2025 | 6:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్నిశాఖల ఆదాయం పెరగాలి!

09-09-2025 01:35:35 AM

-కమర్షియల్, మైనింగ్ శాఖల్లోనే ఆదాయం మెరుగు

-ఇతర శాఖల్లో ఆదాయం పెరుగుదలకు కమిటీలు

-ఆదాయ వనరుల సమీకరణ సబ్ కమిటీ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి

-సాగునీటి ప్రాజెక్టుల్లో పూడికతీత వేగవంతానికి ఆదేశం

హైదరాబాద్, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): వాణిజ్య పన్నుల్లో 4.7 శాతం, గనులశాఖ ఆదాయంలో 18.6 శాతం పెరుగుదల కనపడుతోంద ని, మిగతా శాఖల్లో మాత్రం ఆదాయ సమీకరణలో వెనుకబాటు కనపడుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సోమవారం సచివాలయంలో రాష్ట్ర ఆదాయ వనరుల సమీకరణ సబ్ కమిటీ సమావేశం డిప్యూటీ సీఎం బట్టి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సబ్ కమిటీ సభ్యులు మంత్రులు ఉత్తంకుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు.

భారీ సాగునీటి ప్రాజెక్టుల్లో పూడికతీత పనులను వేగవంతం చేయాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులకు సూచించారు. ఈ పూడికతీత పనులతో సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి నిలువ సామర్థ్యం పెరుగుతుందని, ఇసుక ద్వారా రాష్ట్రానికి ఆదాయం సమకూరుతుందని ఉత్తమ్ వివరించారు. మొదటగా ఒక ప్రాజెక్టులో పూడికతీతను వెంటనే ప్రారంభించాలని సూచించారు. ఏజన్సీ ప్రాంతాల్లో ఇసుక తవ్వే పనులను పూర్తిగా గిరిజన ఏజన్సీల ద్వారా నిర్వహించాలని మంత్రులు సూచించారు.

గిరిజనులకు యంత్ర సామగ్రి అందుబాటులో ఉండదని, ఈ నేపథ్యంలో ఐటీడీఏలోని ఇంజినీరింగ్ విభాగం యంత్ర సామగ్రి సహాయం అందించాలని చెప్పారు. దీని ద్వారా ఏజన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు ఆర్థికంగా బలోపేతం అయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. ఓఆర్‌ఆర్ లోపల ఉన్న కాలుష్యకారక పరిశ్రమలను తరలించేందుకు మూడు వారాల్లో విధి విధానాలను రూపొందించాలని ఆదేశించారు.

సమావేశంలో సీఎస్ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా, ఆర్‌అండ్‌బీ స్పెషల్ సీఎల్ వికాస్‌రాజ్, సీసీఎల్‌ఏ కమిషనర్ లోకేశ్‌కుమార్, కమర్షియల్ టాక్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్ శ్రీధర్, మైన్స్ డైరెక్టర్ శశాంక, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కమిషనర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, రవాణా శాఖ కమిషనర్ సురేంద్రకుమార్ పాల్గొన్నారు.