01-01-2026 02:11:19 AM
బఫర్ జోన్లో అడ్డుగా గేటు నిర్మించిన వైనం
ఆందోళనకు దిగిన గ్రామస్థులు
మనోహరాబాద్, డిసెంబర్ 31 : చెరువులోకి వెళ్లకుండా అడ్డుగా గేటు పెట్టి బఫర్ జోన్ స్థలాన్ని కబ్జాకు పాల్పడిన పరిశ్రమపై పంచాయతీ పాలకవర్గం, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మనోహరబాద్ మం డలం ముప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెం దిన పల్లి చెరువు బఫర్ జోన్ లోకి ఎవరు వెళ్లకుండా నియో సీడ్ పరిశ్రమ కంచెతో పాటు గేట్ నిర్మించిన ఈ ఘాతుకానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న గ్రామ పంచాయతీ పాలకవర్గం బుధవారం కార్యదర్శి రమేష్, సర్పంచ్ కందల రాజానరసింహ, పాలకవర్గ సభ్యులు గ్రామస్థులతో కలిసి అక్కడికి వెళ్లి ఆందోళన చేపట్టారు. గ్రామ సెక్రెటరీ నోటీస్ జారీ చేశారు. వెంటనే అడ్డుగా ఏర్పాటు చేసిన గేటును, అలాగే పెన్సింగ్ కంచెను తొలగించాలని డిమాండ్ చేశారు.
ఇంతకు ముందు ఈ పరిశ్రమ బఫర్ జోన్ లో రోడ్డు వేశారని అప్పుడు ఆందోళన చేయడంతో తొలగించారని అన్నారు. మత్స్యకారులకు చేపలు పట్టుకోకుండా, పశువులు నీరు తాగకుండా చెరువులోకి వెళ్లకుండా చేయడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే తొలగించాలని లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఇరిగేషన్ ఏఈ విజయ్ ను వివరణ కోరగా బఫర్ జోన్ లో గేట్ పెట్టడం నిజమని, వెంటనే తొలగించాలని నోటీస్ ఇచ్చామని అన్నారు. లేకపోతే చట్టరీత్యా పరిశ్రమపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ రామ్ రెడ్డి, పాలకవర్గ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.