నెట్టెంపాడు ఆయకట్టు పనులు త్వరగా పూర్తి చేయాలి
22-08-2026 01:32 AM
అలంపూర్, ఆగస్టు 21: నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలోని పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేసి చివరి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కోరారు. శుక్రవారం గూడెందొడ్డి రిజర్వాయర్ను పరిశీలించిన ఆయన ప్యాకేజీలు 99, 100 కాల్వ పనులు, తాటికుంట రిజర్వాయర్ లింక్ ఛానల్ పనులను వేగవంతం చేయాలని ఎస్ఈ కేశవరావుకు వినతిపత్రం అందజేశారు.
కాల్వల్లో పేరుకుపోయిన జమ్ము, గడ్డిని తొలగించి పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను సూచించారు. పనులు పూర్తయితే ఇటిక్యాల, ఐజ, వడ్డేపల్లి, మానవపాడు మండలాల్లోని చివరి ఆయకట్టు రైతులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. కార్యక్రమంలో రైతులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.






