09-11-2025 01:57:07 AM
భయాందోళనకు గురైన ప్రయాణికులు
చైతన్యపురి పోలీస్స్టేషన్ పరిధిలో ఘటన
ఎల్బీనగర్, నవంబర్ 8(విజయక్రాంతి) : తెలంగాణ ప్రధాన జాతీయ రహదారి 65పై శుక్రవారం అర్ధరాత్రి అల్లరి మూకలు బీభత్సం సృష్టించారు. అల్లరి మూకలు తమ వాహనాలపై ప్రధాన రోడ్ల వెంట పెద్ద ఎత్తున గాండ్రింపులతో కేకలు వేస్తూ కొత్తపేట విక్టోరియా మెట్రో స్టేషన్ సమీపంలో బీభత్సం సృష్టించారు. జాతీయ రహదారిపై వెళ్లుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును అకారణంగా అడ్డగించి డ్రైవర్పై విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డారు.
అనంతరం రాళ్లతో బస్సు అద్దాలను ధ్వంసం చేసి పరారయ్యా రు. ఈ సంఘటన శుక్రవారం అర్ధరాత్రి చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచే సుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేర కు శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఎస్వీటీ ప్రైవేటు ట్రావెల్స్ ఎన్ఎల్ 01 బి 9333 నెంబర్ గల బస్సు దాదాపు 43 మందితో హైదరాబాద్ బీరంగూడ నుంచి పామూరుకు బయలుదేరింది. బస్సు డ్రైవర్ షేక్ మస్తాన్, క్లీనర్ కళ్ళూరి వెంకటనారాయణ కొత్తపేట చౌరస్తా సమీపంలోని విక్టోరియా మెట్రో స్టేషన్ వద్దకు అర్ధరాత్రి సమయంలో చేరుకున్నారు.
ఈ క్రమంలో ఇద్దరు గుర్తుతెలియని యువకులు ద్విచక్ర వాహనంపై బస్సుకు ఎదురుగా వచ్చి అరుస్తూ బస్సు డ్రైవర్ పై విచక్షణ రహితంగా దాడికి పాల్పడడంతో పాటు బస్సు అద్దాలను ధ్వంసం చేసి పరారయ్యారు. ఈ సంఘటనపై బస్సు డ్రైవర్ చైతన్యపురి పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దాడికి పాల్పడిన వ్యక్తుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు సీఐ కే.సైదులు వెల్లడించారు.