30-12-2025 02:00:03 AM
కలెక్టర్ పమేలా సత్పతి
కరింనగర్, డిసెంబర్29(విజయక్రాంతి):జిల్లాకు అవసరమైన యూరియా ఎరువులు సరిపడా నిల్వలు ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా లో ఈ రోజు వరకు 4246 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని తెలిపారు. ఇప్పటివరకు జిల్లా కి 22,368 మెట్రిక్ టన్నుల యూరియా సప్లై చేయడం జరిగిందని తెలిపారు.
రైతులకు ఇబ్బంది లేకుండా ప్రతి సేల్ కౌంటర్ వద్ద షామియానా, త్రాగు నీటి సౌకర్యం కల్పించాలని తెలిపారు. ఉదయం 6.00 గంటల నుండి కౌంటర్ వద్ద యూరియా సేల్స్ ప్రారంభించాలని ఆదేశించారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న యూరియా నిల్వలు మొక్క జొన్న సాగుకు సరిపోతాయని, అవసరాన్ని బట్టి మరిన్ని సరఫరాలు కూడా క్రమం తప్పకుండా అందుతున్నాయని రైతులకు భరోసానిచ్చారు.
యూరియా పంపిణీపై సంబంధిత అధికారులు, వ్యవసాయ శాఖ సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నారని తెలిపారు.కృత్రిమ కొరత సృష్టించడం, అధిక ధరలకు విక్రయించడం వంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు ఎవరైనా యూరియా సరఫరాలో సమస్యలు ఎదుర్కొంటే సమీప వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు. అవసరానికి మించి యూరియా కొనుగోలు చేయకుండా, శాస్త్రీయ పద్ధతిలో వినియోగించాలని రైతులను కలెక్టర్ కోరారు.