17-06-2025 12:50:13 AM
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్లగొండ టౌన్, జూన్ 16 : ప్రభుత్వ ప్రాధామ్యా పథకాల అమలులో జాప్యం చేయకుండా ప్రజావాణి దరఖాస్తులు తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించారు.అనంతరం జిల్లా అధికారులతో వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్ సమీక్షించారు.
ఐసిడిఎస్ ద్వారా అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ మాత్రమే కాకుండా ,గ్రామాలలో అంగన్వాడి, ఆయా, ఆశ వర్కర్ల ద్వారా గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నపిల్లలకు పౌష్టికాహార పంపిణీ, గర్భిణీ స్త్రీలకు నిరంతర పరీక్షలు, చికిత్స , తదితర అంశాలను చూడాల్సిన బాధ్యత ఉందని అన్నారు.అనారోగ్యంతో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి కి వచ్చేవారు అనారోగ్యం ముదిరి చివరి నిమిషంలో రాకుండా ముందే వచ్చే విధంగా అవగాహన కల్పించాలని డిఎంహెచ్ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డిసిహెచ్ఎస్ డాక్టర్ మాతృ, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి డాక్టర్ చంద్రశేఖర్ లకు సూచించారు.
త్వరలోనే రాష్ట్ర రవాణా, బి సి శాఖ మంత్రి ఉమ్మడి నల్గొండ జిల్లా సమీక్ష నిర్వహించనున్నందున సంబంధిత అధికారులు సమాచారంతో సమీక్షకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ ,ఇన్చార్జి డిఆర్ఓ అశోక్ రెడ్డి, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, గృహనిర్మాణ పిడి రాజ్ కుమార్, జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించారు.