20-06-2025 12:08:37 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 19 (విజయక్రాంతి): యోగా ద్వారా ఆరోగ్యం భద్రంగా ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు. శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో శుక్రవారం ‘వన్ డే కౌంట్డౌన్’ పేరిట యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. గురువారం ఆయన స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవానికి 24 గంటల ముందుగా కౌంట్డౌన్ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ వేడుకల్లో ప్రముఖ యోగా సంస్థలు, విద్యాసంస్థలు, సామాజిక సంస్థలు భాగస్వామ్యమవుతున్నాయన్నారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీనివాసవర్మ, ఎంపీలు డాక్టర్ కే లక్ష్మణ్, కృష్ణయ్య, ఈటల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్ హాజరవుతారన్నారు.
అలాగే విద్యార్థి సంఘాలు, ఎన్జీవోలు, డిఫెన్స్, పారామిలిటరీ అధికారులు పాల్గొంటారని చెప్పారు. సినీ నటులు ఖుష్బూ, మీనాక్షి చౌదరి, సాయి ధరమ్తేజ్, తేజ హాజరవుతారని పేర్కొన్నారు. హైదరాబాద్లో గత ఐదారు సంవత్సరాల నుంచి పెద్దఎత్తున యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, ఈ సంవత్సరం కూడా యోగా జేఏసీ అనే సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని కిషన్రెడ్డి వెల్లడించారు.