24-01-2026 09:59:02 AM
మునిపల్లి,(విజయక్రాంతి): ఈ నెల 8,9,10 తేదీలలో మండలంలోని కంకోల్ గ్రామ శివారులో గల వోక్సెన్ యూనివర్సిటీ వెనుక భాగంలోని వొక్సెన్ స్టోర్ లో ఉన్న 40 సెంట్రింగ్ బాక్సులు, 100 కరెంటు వైరు బాక్సులు, 8 హవేల్స్ కంపెనీకి చెందిన ఫ్యాన్ బాక్సులు గుర్తు తెలియని దొంగలు ఎత్తికెళ్లినారు. ఈ విషయమై వోక్సెన్ స్టోర్ అధికారి బుర్రకాయల శ్రీశైలం ఫిర్యాదు మేరకు మునిపల్లి ఎస్ఐ రాజేష్ నాయక్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా పోలీసు సిబ్బంది హనీఫ్, మహేశ్, తుకారాం, సంతోష్ లు కంకోల్ టోల్ గేట్ వద్ద నుండి హైదారాబాద్ లోని ఉప్పల్ వరకు సీసీ కెమెరాలను పరిశీలించుకుంటూ వెళ్ళి నేరస్తుల ఆచూకీ తెలుసుకొని దొంగతనం చేసిన దొంగలను పట్టుకున్నారు.
నిందితులు హైదారాబాద్ లోని సైదాబాద్ లో గల సింగరేణి కాలనీకి చెందిన కేతావత్ పద్మ అనిత, రమావత్ జ్యోతి, నేనావత్ విజయ, ముడావత్ లక్ష్మి , నేనవత్ అనిత లు ఆటో డ్రైవర్ నేనావత్ చందర్ కు రోజుకు రూ. 3వేలు చొప్పున మాట్లాడుకొని కంకోల్ వోక్సెన్ యూనివర్సిటీకి వచ్చి అక్కడ సెక్యూరిటి గార్డ్ కు రూ. 20వేల ఇచ్చి అతని సహకారంతో స్టోర్ రూమ్ వెనుక ఇనుప రేకులు తొలగించి స్టోర్ రూమ్ లోనికి ప్రవేశించి అందులో నుండి 40సెంట్రింగ్ బాక్సులు, 174 హవేల్స్ కంపెనీకి చెందిన రాగి వైరు బాక్సులు, 8కాటన్ల ఎలక్ట్రిక్ సీలింగ్ ఫాన్స్ దొంగిలించుకొని వారు తమ వెంట తెచ్చు కున్న అశోక్ లేల్యాండ్ ఆటోలో ఎక్కించుకొని హైదరబాద్ కు తరలించినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు దొంగిలించిన చోరీ సొత్తును హైదారాబాద్ లోని ఉప్పల్ లోగల సబావత్ భారతి అనే ఆమె యొక్క స్క్రాప్ షాప్ లో అమ్మినట్లు తెలిపారు.
ఆ స్క్రాప్ షాప్ యజమాని సబావత్ భారతి , ఆమె భర్త సబావత్ సత్తయ్య ఇద్దరు కలిసి ఖరీదు చేసిన అట్టి చోరీ సొత్తును హైదరబాద్ లోని భోలక్ పూర్ లో మోహమ్మద్ అబ్దుల్ ఖదీర్ అనే వ్యక్తికి అమ్మగా అతను సబావత్ భారతి, సత్తయ్యలకు 10 లక్షల 70 వేల రూపాయలు ఇచ్చినట్లు నిందితులు ఒప్పుకున్నట్లు తెలిపారు. సబావత్ భారతి, సత్తయ్యలు అట్టి డబ్బులలో నుండి అనితకి 5,00,000, పద్మకి 1,00,000 /, జ్యోతికి 1,00,00, విజయకి1,00,000,, లక్ష్మికి1,00,00చొప్పున ఇవ్వగా మిగిలిన రూపాయలు 1,70,000లను దొంగ సొత్తు అమ్మిన వారికి పంచి మిగితా డబ్బులు 1,70,000లు వారు ఉంచుకున్నారని పరిశోధనలో తెలిందన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు పెద్దమొత్తంలో దొంగతనం చేసిన నిందితులను రిమాండ్ కు తరలించినట్లు ఎస్ఐ రాజేష్ నాయక్ తెలిపారు. నిందితులను చాకచాక్యంగా పట్టుకున్న పోలీసులను సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య గౌడ్, కొండాపూర్ సీఐ సుమన్ కుమార్, ఎస్ఐ రాజేష్ నాయక్ అభినందించారు. అనంతరం ప్రశంసా పత్రాలను అందజేశారు.