16-12-2025 06:54:22 PM
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 17న ఉదయం 7 గంటల నుంచి జరగనున్న ఈ ఎన్నికలకు సంబంధించి పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సోమవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెర పడగా, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ గట్టి పహారాను ఏర్పాటు చేసింది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 182 మండలాల్లోని 3,752 గ్రామ పంచాయతీల్లోని 28,410 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
మూడో విడతలో మొత్తం 4,159 సర్పంచ్ స్థానాలకు 394 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 3,752 సర్పంచ్ స్థానాలకు 12,652 మంది అభ్యర్థులు పోటీపడగా, 28,410 వార్డు సభ్యుల స్థానాలకు 75,725 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే 36,425 వార్డులకు గాను 7,908 వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, 11 గ్రామ పంచాయతీల్లో, 116 వార్డులో నామినేషన్లు దాఖలు కాలేదని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. మరో రెండు గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిలిచిపోయాయి.