12 May, 2026 | 1:25 AM

రోడ్డు విస్తరణలో ఇండ్లు, ప్లాట్లు కోల్పొయిన వారిని ఆదుకోవాలి

12-05-2026 12:08 AM

పెబ్బేరు, మే 11: పెబ్బేరు నుండి వనపర్తికి వెళ్లే ప్రధాన రహదారి విస్తరణలో ఇండ్లు, ప్లాట్లు కోల్పోయిన బాధితులు జిల్లా కలెక్టర్ను కలిసి తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా బాధితుల తరఫున వినతిపత్రం సమర్పించి, తగిన న్యాయం చేయాలని కోరారు.ప్రధాన రహదారి విస్తరణలో ఆస్తులు కోల్పోయిన కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ప్లాట్లు కేటాయించడంతో పాటు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే అసంపూర్తిగా మిగిలి ఉన్న బీటీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని కోరారు. పెబ్బేరువనపర్తి ప్రధాన రహదారిని 40+40 = 80 అడుగుల వెడల్పుతో అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.వినతిపత్రంపై స్పందించిన జిల్లా కలెక్టర్ సమస్యలను పరిశీలించి త్వరలోనే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ప్లాట్లు, ఆర్థిక సహాయం అందించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు బాధితులు తెలిపారు.

అలాగే అసంపూర్తిగా ఉన్న బీటీ రోడ్డు, డ్రైనేజీ పనులను పూర్తి చేయడంతో పాటు రహదారి విస్తరణ పనులు కూడా వేగవంతం చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారని చెప్పారు.ఈ సందర్భంగా కలెక్టర్కు బాధితుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కలెక్టర్ను కలిసిన వారిలో సామాజిక కార్యకర్త వల్లప్ రెడ్డి శ్రీధర్ రెడ్డి, బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి వెంకటన్న గౌడ్, హనుమంత్ రెడ్డి, రామన్ గౌడ్ (ఎన్‌ఆర్జీ), బసవరాజు గౌడ్, అఫ్రోజ్, మధు, నరేష్, శేషపాణి, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.