18-10-2025 09:24:44 AM
కాబూల్: పాక్టికా ప్రావిన్స్లో(Paktika Province) పాకిస్తాన్ వైమానిక(Pakistani Airstrikes) దాడిలో కనీసం ముగ్గురు ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లు(Afghanistan cricketers) మరణించారు. స్నేహపూర్వక మ్యాచ్లో పాల్గొనడానికి ఆటగాళ్లు పాకిస్తాన్ సరిహద్దులోని తూర్పు పాక్టికా ప్రావిన్స్లోని ఉర్గున్ నుండి షరానాకు ప్రయాణించారని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు (Afghanistan Cricket Board) తెలిపింది. ఆ ముగ్గురు ఆటగాళ్లను "కబీర్, సిబ్ఘతుల్లా, హరూన్" అని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు పేర్కొంది. ఈ దాడిలో మరో ఐదుగురు వ్యక్తులు కూడా మరణించారని తెలిపింది. "ఉర్గున్ కు తిరిగి వచ్చిన తర్వాత, ఒక సమావేశంలో వారిని లక్ష్యంగా చేసుకున్నారు" అని ఏసీబీ పేర్కొంది.
దీనిని పాకిస్తాన్ ప్రభుత్వం నిర్వహించిన పిరికి దాడిగా అభివర్ణించింది. ఈ దాడి సంబంధించిన పూర్తి వివరాలను ఏసీబీ ప్రకటించలేదు. ఈ దాడి తర్వాత బాధితులకు గౌరవ సూచకంగా వచ్చే నెలలో జరగాల్సిన పాకిస్తాన్, శ్రీలంకలతో జరిగే త్రిదేశాల సిరీస్ నుండి ఆఫ్ఘనిస్తాన్ వైదొలిగింది. "పాకిస్తాన్ ప్రభుత్వం నిర్వహించిన పిరికి దాడిలో ఈ సాయంత్రం లక్ష్యంగా చేసుకుని పాక్టికా ప్రావిన్స్లోని ఉర్గున్ జిల్లాకు చెందిన ధైర్యవంతులైన క్రికెటర్ల విషాదకరమైన బలిదానంపై ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు తన ప్రగాఢ విచారాన్ని వ్యక్తం చేస్తోంది" అని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఎక్స్ లో పోస్ట్లో తెలిపింది.
క్రికెటర్లు మృతికి ఆఫ్ఘనిస్తాన్ T-20 జట్టు కెప్టెన్ రషీద్ ఖాన్(Rashid Khan) సంతాపం తెలిపారు. ఇటీవలి దాడులను రషీద్ తీవ్రంగా ఖండించారు. స్నేహపూర్వక సిరీస్ నుండి వైదొలగాలని ఏసీబీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించాడు. "ఇటీవల పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్పై జరిపిన వైమానిక దాడుల్లో పౌరులు మరణించడం నన్ను తీవ్రంగా బాధించింది. ప్రపంచ వేదికపై తమ దేశానికి ప్రాతినిధ్యం వహించాలని కలలు కన్న మహిళలు, పిల్లలు, ఔత్సాహిక యువ క్రికెటర్ల ప్రాణాలను బలిగొన్న విషాదం ఇది. పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం పూర్తిగా అనైతికమైనది. అనాగరికమైనది. ఇటువంటి అన్యాయమైన, చట్టవిరుద్ధమైన చర్యలు మానవ హక్కుల తీవ్రమైన ఉల్లంఘనను సూచిస్తాయి." అని రషీద్ ఖాన్ ఎక్స్ పోస్ట్లో పేర్కొన్నారు.