04-10-2025 10:18:34 PM
వైద్య విద్యలో సీట్ సాధించిన అక్షరకు ఘన సన్మానం..
సూర్యాపేట (విజయక్రాంతి): జిల్లాలోని ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన యాతాకుల అక్షర వైద్య విద్యలో ప్రతిష్ఠాత్మకమైన ఎంబీబీఎస్ సీటు సాధించడం అభినందనీయమని, అక్షర సమాజానికి ఆదర్శంగా నిలవాలని మాజీమంత్రి సూర్యాపేట శాసన సభ్యులు జగదీశ్వర్ రెడ్డి అన్నారు. తన క్యాంపు కార్యాలయంలో అక్షరను శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ “చక్కగా చదువుకుని తల్లిదండ్రులకు, ఊరికి పేరు తీసుకురావాలని నిరుపేదలకు సేవ చేసి సమాజానికి ఆదర్శంగా నిలవాలన్నారు.
ప్రయత్నం చేస్తే ఏ కలనైనా నిజం చేసుకోవచ్చని అక్షర నిరూపించిందన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచే ప్రతిభావంతులైన విద్యార్థులు వెలువడతారనేది ఈ విజయానికి నిదర్శనం” అని ఆయన అన్నారు. కుటుంబానికి, ఊరికీ గర్వకారణంగా నిలిచిందన్నారు. చదువులోనే కాకుండా అక్షరలో ఉన్న వినయశీలత, క్రమశిక్షణ, పట్టుదల ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టాయంటూ పెద్దలు సూర్యాపేట మున్సిపల్ మాజీ చైర్మన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ ప్రశంసలు కురిపించారు.
చదువులో ప్రతిభ చూపుతూ ముందుకు..
తెలంగాణ చిన్న పత్రికల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోక్-ఉపేంద్ర దంపతుల కుమార్తెన అక్షర చిన్ననాటి నుంచే చదువులో ప్రతిభ కనబరుస్తూ ముందుకు సాగింది. ఆమె నీట్ పరీక్షలో మంచి స్కోర్ సాధించి ఎస్సి–2 కేటగిరీ కింద మల్లారెడ్డి మెడికల్ కళాశాల(సి.ఎం.ఆర్.ఎం.)లో ఎంబీబీఎస్ సీటు పొందింది. గ్రామస్థులు అక్షరను అభినందిస్తూ “మన ఊరి కూతురు వైద్యురాలు అవుతుందనేది గర్వకారణం” అన్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు స్ఫూర్తిదాయకమని అభివర్ణించారు. పట్టుదలతో శ్రమిస్తే ఎలాంటి లక్ష్యమైన సాధ్యమని మరోసారి నిరూపించిందని ప్రశంసించారు. వైద్యురాలిగా మారబోయే ఈ యువతి భవిష్యత్తులో నిరుపేదలకు అండగా నిలిచి, తన ఊరి పేరును రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిష్ఠింపజేస్తుందని అందరూ విశ్వాసం వ్యక్తం చేశారు.