ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా చూడాలి
చిట్యాల, డిసెంబర్ 29(విజయ క్రాంతి): రాబోయే సంక్రాంతి పండక్కి జాతీయ రహదారి పై వాహనదారులకు ట్రాఫిక్ సమస్యలు ఏర్పాడకుండా చూడాలని ఎన్ హెచ్ ఎ ఐ అధికారులను నల్లగొండ జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవర్ హెచ్చరించారు. సోమవారం చిట్యాల పట్టణంలో, వెలిమినేడు, పెద్ద కాపర్తి గ్రామాలలో జాతీయ రహదారి 65 పై జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను ఎన్ హెచ్ ఏ ఐ అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ చిట్యాల లో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద ఉన్న గుంతల ను మరమ్మతు చేయాలని, పట్టణంలో ఉన్న గుంతలను పూడ్చకుండా వదిలేసిన అధికారులను ఎస్పి మందలించారు. పండగలప్పుడు జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ కాకుండా రోడ్డుపై తగిన ఏర్పాట్లు చేయాలని నేషనల్ అథారిటీ అధికారులకు, బ్రిడ్జి కాంట్రాక్టర్ కు ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఆదేశించారు. బ్లాక్ స్పాట్ల వద్ద కూడా పోలీసులు తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయన వెంట డీఎస్పీ శివరాంరెడ్డి, సిఐ కె నాగరాజు, ఎస్త్స్ర మామిడి రవికుమార్, సిబ్బంది పాల్గొన్నారు.






